నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. తాజాగా ఆదివారం నిర్మల్ పట్టణం, లక్ష్మణచాంద, నర్సాపూర్(జీ), సారంగాపూర్ మండలాల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ నాయకులు ఉండగా.. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నిర్మల్ అర్బన్/ లక్ష్మణచాంద/నర్సాపూర్(జి)/ సారంగాపూర్, అక్టోబర్ 29 : నిర్మల్ జిల్లాకేంద్రంతోపాటు లక్ష్మణచాంద, నర్సాపూర్(జి), సారంగాపూర్ మండలాలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నిర్మల్ పట్టణంలోని కైకాడి, గంగపుత్ర సంఘం.. మైనార్టీ, అంబేద్కర్ యువజన సంఘం.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు.. లక్ష్మణచాంద మండలంలోని చామన్పెల్లి గ్రామానికి చెందిన 100 మందికి పైగా యాదవ సంఘ సభ్యులు.. నర్సాపూర్(జి) మండల కేంద్రానికి చెందిన 50 మంది ముస్లింలు, టెంబూర్ని గ్రామానికి చెందిన 40 మంది.. సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు పర్చని సంక్షేమ పథకాలు, అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని, రాష్ట్రంలో టీడీపీ ఎలా కనుమరుగయిందో అదేగతి కాంగ్రెస్కు పడుతుందన్నారు. అంబానీ, అదానీ ఆస్తుల కోసమే బీజేపీ పని చేస్తోందని, దేశంలో ధరల నియంత్రణ, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
దేశంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు. వివిధ చోట్ల జరిగిన కార్యక్రమాల్లో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ లక్ష్మణచాంద మండల ఇన్చార్జి, మంత్రి సోదరుడు అల్లోల సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, నర్సాపూర్ జడ్పీటీసీ చిన్న రామయ్య, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఇప్ప రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు.