దిలావర్పూర్, ఆగస్టు 17 : రూ.6 కోట్లతో కదిలి ఆలయ పునః నిర్మాణ పనులకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ పూర్తి చేశామని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ప్రసిద్ధ కదిలి పాపహరేశ్వర ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఆలయ పండితులు మంత్రి, జిల్లా పరిషత్ చైర్పర్సన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి అనుమతితో దేవాదాయ శాఖ నిబంధనల మేరకు ఆలయ డివిజనల్ ఇన్స్పెక్టర్ (ఈవో) రవికిషన్గౌడ్ ఆలయ నూతన పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాడెగాం గ్రామానికి చెందిన నార్వడె వెంకట్రావు పాటిల్ను చైర్మన్గా సభ్యులు ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా సిండె అనురాధ, సాలాయిగారి చంద్రశేఖర్రెడ్డి, ఆలూర్ రమేశ్, పుల్లిండ్ల లింగన్న, తోట రమాకాంత్, నల్ల పురుషోత్తం రెడ్డి, ఎక్స్అఫీషియో సభ్యుడిగా పంచాక్షరి నియమితులయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులను మంత్రి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి నిరంతరం పనిచేయాలని సూచించారు. కదిలికి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి 10 ఎకరాల భూమిని తీసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పునః నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయాన్ని యాదాద్రి తరహాలో కృష్ణ శిలలతో చేపట్టి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలోనే 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ప్యాకేజీ 27 పనులు పూర్తవుతాయని, దీని ద్వారా రైతులకు త్వరలోనే సాగు నీరు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత-రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మంత్రి కుమారుడు అల్లోల గౌతమ్రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, కదిలి ఆలయ నూతన చైర్మన్ వెంకట్రావు, ఎంపీపీ అక్షర, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్న దేవేందర్రెడ్డి, రైతుబందు సమితి మండలాధ్యక్షుడు కోడే రాజేశ్వర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నరెడ్డి, కాల్వ లక్ష్మీ నరసింహస్వామి, ఆలయ చైర్మన్ పూజారం మహేశ్, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, కదిలి ఆలయ మాజీ చైర్మన్లు భుజంగ్రావుపటేల్, సంబాజీపటేల్, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్ధే అనిల్, వినోద్కుమార్, కోడే నవీన్, దనే రవి, మారుతీపటేల్, రాజు, కొమ్ముల పెద్ద దేవేందర్రెడ్డి, తహసీల్దార్ డీ సరిత, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ఖాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
మామడ, ఆగస్టు17 : మండలంలోని జగదాంబతండా గ్రామానికి చెందిన 100 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, నాయకులు కైలాస్, సతీశ్ ఉన్నారు.
మంత్రికి మెప్మా ఉద్యోగుల సన్మానం
నిర్మల్ అర్బన్, ఆగస్టు 17 : మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ వర్తింపజేయడంపై శాస్త్రినగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిత్రపటాలకు పాలాబిషేకం చేశారు. మంత్రిని ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో మెప్మా పీడీ సుభాష్, మెప్మా ఉద్యోగులు పాల్గొన్నారు.