భైంసా, ఫిబ్రవరి 2 : బీజేపీకి బీఆర్ఎస్సే ప్ర త్యామ్నాయమని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని మహారాష్ట్రకు చెందిన నాయకుడు డీబీ పటేల్ ఇంట్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్నారు. అలాగే తెలంగాణలో రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకు ఎకరాకు రూ.10 వేలు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు రూ.1,00,116 అందిస్తున్నారని పేర్కొన్నారు.
నాందేడ్లో ఈ నెల 5న నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించామని, అక్కడి ప్రజలకు తెలంగాణ పథకాలను వివరించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్ని వర్గాలను నిరాశ పర్చిందన్నారు. సామాన్య ప్రజల నడ్డీవిరిచి, సబ్సిడీల రూపంలో కార్పొరేట్ పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టేలా ఉందన్నారు. ఈయన వెంట ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మురళీగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, సంజీవ్ రెడ్డి, డీబీ పటేల్, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
మంత్రికి సన్మానం..
తానూర్, ఫిబ్రవరి 2 : నాందేడ్లో 5వ దీన జరిగే బహిరంగ సభను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డిని బెల్తరోడ గ్రామానికి చెందిన జాగృతి నాయకుడు అట్టల్ దేవీదాస్, గ్రామస్తులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ.. నాందేడ్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. వీరి వెంట ఎమ్మెల్యే విఠల్రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిప్పెర కృష్ణ, బీఆర్ఎస్ నాయకుగు పోషెట్టి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మల్లన్న స్వామికి పట్టు వస్ర్తాలు..
నిర్మల్ అర్బన్, పిబ్రవరి 2 : నిర్మల్ పట్టణంలో మల్లన్న స్వామి పల్లకీ మంత్రి అల్లోల నివాసానికి చేరుకోగా, సతీమణి విజయలక్ష్మితో కలిసి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముజ్గి మల్లన్న ఆలయాన్ని రూ.40 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గత డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజున ప్రారంభమైన పల్లకీ సేవ రెండు నెలలు పూర్తి చేసుకొని తిరిగి మాఘ పౌర్ణమిన గ్రామంలో కొలువుదీరిన ఆలయానికి చేరుకుంటుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ నెల 4న కళ్యాణం, 6న రథోత్సవం, 8న అగ్నిగుండ ప్రవేశంతో పాటు జాతర మహోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్, సాయిదీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, తదితరులున్నారు.