నిర్మల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి, ప్రగతికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరుల త్యాగాలను కొనియాడారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నదని కితాబ్ ఇచ్చారు. మన పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండడం గర్వకారణమన్నారు.
అభివృద్ధి పథంలో నిర్మల్ జిల్లా..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతోనే నిర్మల్ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని మంత్రి ఐకేరెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టం వాటిల్లిందని, ప్రాణనష్టం జరగకుండా చూడగలిగామని, వరద బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించడంతో పాటు అండగా నిలిచామన్నారు. రైతుబంధు కింద 1,94,58 మంది రైతులకు ఇప్పటివరకు రూ.2,178.57 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా పథకం కింద ఇప్పటి వరకు 2,965 మంది రైతు కుటుంబాలకు రూ.148.25 కోట్లు అందజేశాం. 2022-23 యాసంగిలో 204 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 36,222 మందికి చెందిన 1.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.339.58 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇప్పటి వరకు 40.03 లక్షల పని దినాలు కల్పించి రూ.129.64 కోట్లు చెల్లించాం. కొయ్యబొమ్మల తయారీలో వినియోగించే పొనికి మొక్కలను తొమ్మిదెకరాల్లో నాటించాం.
మిషన్ కాకతీయ పథకం కింద 359 చెరువులను బాగు చేసి.. రూ.162.44 కోట్లు ఖర్చు చేశాం. 692 గ్రామాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ కింద ప్రభుత్వం రూ.1,318 కోట్లతో ఇంటెక్వెల్స్, పైప్లైన్ పనులను పూర్తి చేశాం. నిర్మల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుతో మెరుగైన వైద్యం అందుబాటులోకి రానున్నది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్గా నిలిచింది. మన ఊరు-మన బడి పథకం కింద 260 పాఠశాలలను ఎంపిక చేసి రూ.82 కోట్లతో 12 రకాల వసతులు కల్పించాం. రూ.56.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించుకున్నాం. లోకేశ్వరం మండలంలోని అర్లి వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులురావడం సంతోషంగా ఉంది. త్వరలోనే రూ.46 కోట్లతో నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.45 లక్షల ఈత, ఖర్జూర మొక్కలు నాటించామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్, అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొన్నారు.