ఉట్నూర్, డిసెంబర్ 19 : రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని కుమ్రం భీం ప్రాంగణంలోని ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి చివరి పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికలు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ ఫలితాల ఆధారంగా విద్యార్థులకు బోధన చేపట్టాలన్నారు. వెనుకబడ్డ వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తరగతులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు దిలీప్ కుమార్, ఏసీఎంవో జగన్, ఉద్దవ్, రాజమౌళి, శివాజీ, సంబంధిత ఏటీడీవోలు క్రాంతి, అమిత్, పురుషోత్తం, చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఐఎస్ఎల్ పోటీల ఏర్పాట్ల పరిశీలన
ఉట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలో జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే గురుకులాల్లో ఇంటర్ సొసైటీ లీగ్ (ఐఎస్ఎల్) పోటీల ఏర్పాట్లను మంగళవారం ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుమ్రం భీం ప్రాంగణంలో అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ పోటీలు, క్రీడా పాఠశాలలో టెన్నికాయిట్, ఉద్యోగుల నివాస సముదాయం ముందు గల మైదానంలో వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, పీఎంఆర్సీలో చెస్, దాని వెనుకల గల మైదానంలో హాకీ పోటీలు, ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల మైదానంలో హ్యాండ్బాల్, ఫుట్బాల్, బాక్సింగ్, రెజ్లింగ్, క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రీడలకు 5వేల మంది రానుండడంతో సదుపాయాలు, రాత్రులు విద్యుత్ సౌకర్యం ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీడీ దిలీప్ కుమార్, ఏపీవో భాస్కర్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, గురుకులం క్రీడల సమన్వయకర్త శ్రీనివాస్, డీఈ శివప్రసాద్, ఏటీడీవో క్రాంతి, పీడీలు హేమంత్, శ్రీనివాస్, అతుల్, శేఖర్, శివకృష్ణ ఉన్నారు.
హాకీ మైదానాన్ని అందుబాటులోకి తెస్తాం
క్రీడాపాఠశాల విద్యార్థులకు త్వరలోనే హాకీ మైదానాన్ని అన్ని రకాల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తామని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్ అన్నారు. కుమ్రం భీం ప్రాంగణంలో ఇటీవల కామారెడ్డిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన మోతీరాం, చరణ్, ప్రమోద్, శంభు క్రీడాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి జరిగే జాతీయ స్థాయి హాకీ పోటీల్లో సత్తాచాటాలని కోరారు. అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని, కోచింగ్ను అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గురుకులం అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.