ఎదులాపురం, ఫిబ్రవరి 6 : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతు లు, బదిలీలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తుకున్న అర్హత కలిగిన ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారి కోరిక మేరకు ఖాళీలను అనుసరించి చేపట్టాలని తెలిపారు. సీనియారిటీ విషయంలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి దరఖాస్తు దారుడికి పూర్తి సమాచారాన్ని రాత పూర్వకంగా అందించాలన్నారు. బదిలీల నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులకు ఎలాం టి ఆటంకం కలుగకుండా వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసేలా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు. వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా, ఏ ఒక్కరూ ఫెయిల్ కాకుండా ముందస్తు రివిజన్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో ప్రణీత, సెక్టోరల్ అధికారులు నర్సయ్య, నారాయణ, సుజత్ ఖాన్, ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.