ఆదిలాబాద్/నిర్మల్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) ;2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే.. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించారనే భావన వ్యక్తమవుతున్నది. రైతుబంధు, రైతుబీమా,చేనేత బీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక సంక్షేమ పథకాలకు గతం కంటే ఎక్కువబడ్జెట్ కేటాయించి ప్రభుత్వం తన మాననీయ కోణాన్ని చాటుకున్నది. వైద్య, విద్య, నీటి పారుదల వంటి అనేక అభివృద్ధి రంగాలకు పరిపూర్ణంగా నిధులు ప్రతిపాదించింది. కాగా.. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టు తెరపైకి రావడంతో ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై బడ్జెట్ వరాల జల్లు కురిపించింది. ప్రతి నియోజకవర్గానికి 1,100 దళితబంధు యూనిట్లు రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో రూ.1,100 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. రైతుసంక్షేమ కార్యక్రమాల కింద 6.19 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.26,831 కోట్లు కేటాయించింది. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రూ.31,426 కోట్లు వెచ్చించనున్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించారని వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సాకారం లేకపోయినా కేసీఆర్ తన మార్క్ పథకాలకు నిధులు కేటాయించారంటూ ప్రశంసలు కురుస్తున్నారు.
బడ్జెట్లో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టును తెరపైకి ప్రభుత్వం తెచ్చింది. తాజా నిర్ణయంతో ఉద్యోగల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. భూమి ఉండి ఇళ్లు కట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారిపై ప్రభుత్వం ఉదారత చూపింది. ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల మంది లబ్ధిదారులకు రూ.3 లక్షల చొప్పున అర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 20 వేల మందికిపైగా లబ్ధి చేకూరనుంది. అదనపు భారం అవుతుందని తెలిసినా.. తాజాగా మంజూరు చేసినా ఆసరా పింఛన్లకు సహాయం అందించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, వివిధ కీలక పథకాలకు చేసిన కేటాయింపులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఈ ఏడాది 11 వేల మందికి దళితబంధు..
దళితుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా తీసుకువచ్చిన దళితబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తున్నది. తొలి విడుతలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి 1000 మందికి లబ్ధి చేకూరింది. ఈ పథకం కింద రూ.100 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు చేరాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,16,129 మంది ఎస్సీ జనాభా ఉన్నారు. రెండో విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరు కానున్నాయి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాకు 11000 యూనిట్లు మంజూరుకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో రూ.1100 కోట్లు ఖర్చు చేయనున్నారు.
‘దళితబంధు’ ఓనర్ను చేసింది
దళితబంధు ఓ అద్భుత పథకం. నేను ఇంతకు ముందు ప్రైవేట్ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేసిన. దళితబంధు కింద రూ.10 లక్షలు రావడంతో సొంతంగా చెన్నూరు కొత్త బస్టాండ్ సెంటర్లో ల్యాబ్ పెట్టుకున్నా. ఒకప్పుడు రూ.10 వేల జీతానికి పని చేసేనోడిని ఇప్పుడు ల్యాబ్కు ఓనర్ అయ్యాను. ఇదంతా దళితబంధు వల్లే సాధ్యమైంది. ఇప్పుడు నా కింద వర్కర్ కూడా ఉన్నాడు. నాతో పాటు మరొకరికి ఉపాధి దొరికింది అంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమే.
– ఆకుదారి సమ్మయ్య, పొక్కూరు, చెన్నూరు మండలం
జాతరలకు ప్రాధాన్యం ఇస్తున్నది..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలను మెరుగుపర్చి అండగా నిలుస్తున్నది. మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో జరిగే జాతరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. దేశంలోనే సమ్మక్క-సారలమ్మ తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన నాగోబా, దండారీ ఉత్సవాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నది. ఈ సారి బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించడం సంతోషం. ఫలితంగా గిరిజనులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
– మర్సుకోల తిరుపతి, గిరిజన సంఘం నాయకుడు
ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్
సీఎం కేసీఆర్ 2017 మార్చిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారు. కల్యాణలక్ష్మి పథకానికి 2023-24 బడ్జెట్లో 2 వేల కోట్లు, షాదీముబారక్ పథకానికి రూ.450 కోట్లు కేటాయించారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత డిసెంబర్ చివరి వరకు నిర్మల్ జిల్లాలో 26,425 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఆయా కుటుంబాలకు రూ.222 కోట్లు పంపిణీ చేశారు. రూ.1,00,116 ప్రభుత్వం అందిస్తుండడంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతున్నది.
గ్రూప్-1 రాశా.. గ్రూప్-2కు దరఖాస్తు చేశా
నేను రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇప్పట్లో పడుతాయ నుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ గతేడాది భర్తీకి అనుమతి ఇవ్వడంతో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. పరీక్ష కూడా రాశాను. గ్రూప్-2కు కూడా దరఖాస్తు చేశాను. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం.. అంతకుమంచిఉద్యోగాలు వేశారు. వచ్చే నోటిఫికేషన్లలో కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఉద్యోగాల భర్తీకి చొరవ చూపిస్తున్న సీఎం కేసీఆర్కు నిరుద్యోగులంతా రుణపడి ఉంటారు.
– కుమార్, విద్యార్థి, మంచిర్యాల
భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ
రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జారీ చేసింది. నేను కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న. పరీక్ష రాశా. ఇటీవల మార్కులు కలపడంతో ఈవెంట్స్కు అర్హత సాధించా. ఈవెంట్స్ కోసం నిర్మల్లో శిక్షణ తీసుకుంటున్న. మా లాంటి యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లు వెలువడగా, కొన్నింటికి పరీక్షలు కూడా జరిగాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు గతంలో ఎన్నడూ చూడలేదు.
– జీ.సంకేత్, పెంబి, నిర్మల్ జిల్లా
చెట్లు మస్తు పెద్దగా అయినయ్
హరితహారం కింద మా ఊరిలో మస్తు చెట్లు నాటిన్రు. రోడ్లపొంటి, పొలాల పొంటి పెట్టిన చెట్లు మస్తు పెద్దగా అయినయ్. మా ఊరి చుట్టూ ఉన్న అడవిలో కూడా చెట్లు పెట్టిన్రు. ఇది వరకు అడవంతా పల్చగా ఉండేది. ఇప్పుడు పచ్చగా కనిపిస్తుంది. వానలు కూడా మస్తు పడుతున్నయ్. నీళ్లకు ఢోకా లేకుంటైంది. నర్సరీ నుంచి మాకు కావాల్సిన మొక్కలు తెచ్చుకొని నాటుతం. ఇసొంటి కార్యక్రమం ఎవ్వరూ చేయలె.
– మడావి కేశవ్రావు, ధనోరా, కెరమెరి
ప్రగతి పథంలో పల్లెలు
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. అధ్వానంగా, శిథిలావస్థ, చెత్తాచెదారంతో నిండిన పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో సరికొత్త అందాలను సంతరించుకు న్నాయి. ట్రాక్టర్, ట్యాంకర్ పంపిణీ, సిగ్రిగేషన్ షెడ్ల నిర్మాణంతో పంచాయతీలకు ఆదాయం సమకూరు తుంది. పల్లెప్రకృతి వనాలు, హరితవనాల కారణంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు. వానకాలం, ఇతర సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గింది.
– మీనాక్షి గాడ్గే, సర్పంచ్, ముక్రా(కే), ఇచ్చోడ మండలం
మా గోస తీర్చిన దేవుడు కేసీఆర్
తెలంగాణ రాకముందు చెలిమెల నీళ్లు తాగేటోళ్లం. వానకాలంల గా నీళ్లు తాగితే రోగాలు వచ్చేటివి. ఇగ ఎండాకాలమైతే మా తిప్పలు అన్నీ.. ఇన్నీ కావు. పనులు బంద్ జేసుకొని పొలాలు, వాగుల పొంటి తిరిగేటోళ్లం. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా బాధలన్నీ పోయినయ్. మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయ్. ప్రతి రోజు రాత్రీ పగలూ ఇంటింటికీ తాగు నీరిస్తున్నరు. మా గోస తీర్చిన దేవుడు కేసీఆర్ సార్.
– టేకం భీంభాయి, టోకెన్ మోవాడ్, కెరమెరి
మా జీవితాలు బాగుపడ్డయ్..
బీఆర్ఎస్ పాలనలోనే ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందుతున్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. యేటా రంజాన్ పండుగకు కొత్త బట్టలతో కూడిన గిఫ్ట్ ప్యాక్ ఇస్తున్నరు. మా పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. షాదీముబారక్ కింద పెండ్లి ఖర్చులు అందజేస్తున్నారు. బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తున్నరు. గతంలో పాలకులు తమను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్పా.. ఏమి చేయలేదు. ఒక్క కేసీఆర్ హయాంలోనే మైనార్టీల జీవితాలు బాగుపడ్డయ్.
– లతీఫ్ అహ్మద్, గుల్జార్ మార్కెట్, నిర్మల్
పింఛన్తోనే బతుకు
మాది పేద కుటుంబం. ఇంతకాలం కూలీ పనులకు పోయేది. ఇప్పుడు వయసు మీదపడింది. ఏ పనీ చేయలేక పోతున్న. సర్కారోళ్లు ఇచ్చే పింఛన్ డబ్బులు ఎంతో అక్కరకు వస్తున్నయ్. రేషన్ బియ్యం కూడా ఇస్తున్నరు. ఇది వరకు అరకొరగా పింఛన్ ఇచ్చేటోళ్లు. ఆ డబ్బులు కూడా ఎప్పుడు వస్తయో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి నెలా నా బ్యాంకు ఖాతాల్నే డబ్బులు పడుతున్నయ్. ఇగ ఇంతకంటే మాకు ఏంగావాలె.. ఇసొంటి సీఎం ఎప్పటికీ ఉండాలె.
– చునార్కర్ ఉర్కుడ, ఝరి, కెరమెరి
నీటి పారుదలకు రూ.451.49 కోట్లు
ఉమ్మడి జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న పనులు, కొత్తగా చేపట్టాల్సిన పనులు, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.444 కోట్లు కేటాయించింది. ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెన్గంగ ప్రాజెక్టుకు రూ.289.61 కోట్లు, వార్ధా నదిపై నిర్మించే బరాజ్కు రూ.101.75 కోట్లు కేటాయించింది. కుమ్రం భీం ప్రాజెక్టులో పంట కాలువ పనులు చేసేందుకు రూ.23.22 కోట్లు, జగన్నాథపూర్ పెద్దవాగు ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటు, ఇతర మరమ్మతులు రూ.12 కోట్లు, వట్టివాగు ప్రాజెక్ట్ మరమ్మతుకు రూ.3 కోట్లు, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ మరమ్మతులు, ఇతర పనులకు రూ.6.79 కోట్లు, మంచిర్యాల జిల్లాలో నీల్వాయి ప్రాజెక్ట్కు రూ.6.02 కోట్లు, ర్యాలీవాగుకు రూ.3 కోట్లు, గొల్లవాగుకు రూ.6.10 కోట్లు కేటాయించారు.
‘మన ఊరు-మనబడి’తో 996 పాఠశాలల అభివృద్ధి..
రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద విద్యార్థులకు మెరుగైన ఆంగ్ల బోధన అందిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 996 పాఠశాలలను ఎంపిక చేసి సకల సౌకర్యాలు కల్పించింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 309.18 కోట్లు ఖర్చు చేసింది. తాగునీరు, ఫర్నిచర్, డిజిటల్ తరగతులు, విద్యత్ వసతి, కిచన్షెడ్లు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించింది. రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన విద్యనందిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ ఏడాది బడ్జెట్లో మన ఊరు- మనబడి, విద్యారంగం అభివృద్ధికి రూ. 19 వేల 93 కోట్లు కేటాయించడం విశేషం.
పేదల దేవుడు కేసీఆర్..
మాలాంటి పేదలకు కేసీఆర్ సారు దేవుడి లాంటి వారు. నా బిడ్డ లావణ్యకు ఐదేండ్ల వయసు ఉన్నప్పుడే భర్త చేపలు పట్టబోయి చెరువులో మునిగి చనిపోయిండు. నాటి నుంచి బీడీలు చుట్టు కుంటూ తండ్రి లేని ఒక్కగానొక్క బిడ్డను కష్టపడి సదివించుకున్న.పెండ్లి ఎట్ల చేయాలని చాలా దిగులైంది. అప్పు తెచ్చి పెండ్లి చేసిన. కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116లు సర్కారు మంజూరు చేసింది. అప్పు కట్టిన. బడ్జెట్లో కల్యాణ లక్ష్మికి భారీగా నిధులు కేటాయించడం సంతోషం..
– మట్టి లక్ష్మి, కల్యాణలక్ష్మి లబ్ధిదారు (నిర్మల్)