ఉమ్మడి రాష్ట్రంలో వైద్యసేవలు అధ్వాన్నంగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులకు వైద్యం అందాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. వాగులు, వంకలు దాటి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితి. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక వైద్యరంగంలో సమూల మార్పులు వచ్చాయి. గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు.. సబ్ సెంటర్స్ను పల్లె దవాఖానలుగా.. అర్బన్ హెల్త్ సెంటర్స్ను బస్తీ దవాఖానలుగా మార్చారు. కోట్లాది రూపాయలు వెచ్చించి సౌకర్యాలు సమకూర్చడంతోపాటు భవనాల నిర్మాణం, అప్గ్రేడేషన్, వైద్యులు, సిబ్బంది నియామకం, అధునాతన పరికరాలు సమకూర్చడం వంటివి చేశారు. దీనికితోడు ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నోస్టిక్ సెంటర్స్, డయాలసిస్ కేంద్రాలను కూడా నెలకొల్పారు. కొత్తగా టిఫ్ఫా, సీటీ స్కానింగ్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో బుధవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. నిర్మల్ జిల్లా దవాఖానలో రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించనుండగా.. బోథ్లో రూ. 11.50 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు భూమిపూజ చేయనున్నారు.
నిర్మల్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురైన వైద్యం.. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో అధునాతన పరికరాలతో వైద్యం అందుతున్నది. ఈ ఎనిమిదేండ్ల కాలంలో పీహెచ్సీల పరిధిలోని సబ్ సెంటర్స్.. పల్లె దవాఖానలుగా, అర్బన్ హెల్త్ సెంటర్స్.. బస్తీ దవాఖానలుగా రూపాంతరం చెందాయి. రెగ్యూలర్ వైద్యులను నియమించడంతో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రధానంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖాన కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నే విధంగా సేవలందిస్తూ పేదల మన్ననలు పొందుతున్నది. నిన్న మొన్నటి వరకు ప్రైవేటు వైపు పరుగులు పెట్టిన పేదరోగులు.. ఆధునిక వైద్య సౌకర్యాలు ఉచితంగా అందుతుండడంతో సర్కారు దవాఖానకు వస్తున్నారు. నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజు దాదాపు 500 మంది ఔట్ పేషెంట్స్గా, 50 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. జనరల్, ఆర్థోపెడిక్ సర్జరీలు అందుబాటులోకి రావడంతో ప్రతినెలా 200 మందికి పైగా ఉచితంగా శస్త్రచికిత్సలు అందుతున్నాయి. అలాగే ఈఎన్టీ, ఆప్తాల్మజీ, దంతవైద్యం, ఫిజియోథెరఫీ, జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, పిడియాట్రిక్ విభాగాలకు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండడంతో పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
నిర్మల్ జిల్లా ప్రధాన దవాఖానలో రోగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పా టు చేశారు. ఇందులో అన్ని రకాల రక్త, మల, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 29 శాంపిల్స్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. సే కరించిన నమూనాలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాన్ని సమకూర్చారు. గత రెండేళ్ల కాలం లో 80,886 మంది రోగుల నుంచి నమూనాలు సేకరించి 1,61,215 పరీక్షలు చేశారు. అలాగే డ యాలసిస్ సెంటర్ కిడ్నీ రోగులకు వరంగా మా రింది. మొదట మూడు పడకలతో ఏర్పాటై.. ప్ర స్తుతం పది పడకల స్థాయికి ఉన్నతీకరించబడిం ది. డయాలసిస్ సెంటర్ రాక ముందు కిడ్నీ రోగు లు నిజామాబాద్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ కష్టాలు తప్పాయి.
ప్రభుత్వ దవాఖానలో ఖరీదైన అత్యాధునిక స్కానింగ్ సేవలు లభిస్తున్నాయి. ఇప్పటికే ప్రసూతి ఆస్పత్రిలో టిఫ్ఫా స్కానింగ్ సేవలు గర్భిణులకు అందుతున్నాయి. ప్రతినెలా 100 మందికి పైగా గర్భిణులకు సేవలు పొందుతున్నారు. కాగా.. అప్పుడే పుట్టిన పిల్లల సంరక్షణ కోసం 19 పడకలతో ఎస్ఎన్సీయూ సెంటర్ను ఎంసీహెచ్లో ఏర్పాటు చేశారు. తాజాగా జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కానింగ్ సేవలు కూడా అందించనున్నారు. దాదాపు రూ.1.50 కోట్ల విలువైన సీటీ స్కానింగ్ యంత్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం ప్రారంభించనున్నారు. ఈ స్కానింగ్ యంత్రం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు, న్యూరో, మెదడు సంబంధిత రోగులకు స్కానింగ్ తిప్పలు తప్పనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో ఇక్కడి సర్కారు వైద్య రంగానికి మహర్దశ పట్టనుంది. పట్టణ శివారులోని భీమన్న గుట్ట ప్రాంతంలో కాలేజీ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది. ముందుగా 100 సీట్లకు ప్రవేశాలు చేపట్టనున్నారు. కాగా.. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ జీవో కూడా జారీ చేశారు. నూతన భవనాల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.166 కోట్లు కేటాయించింది.
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక కార్పొరేటు స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాం. ఆధునీకరణతోపాటు అవస రమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నది. పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. ఎంసీహెచ్లో 40 శాతానికి పైగా నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. గర్భిణులకు టిఫ్ఫా స్కానింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం. బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా సిటీ స్కానింగ్ సేవలను ప్రారంభించనున్నాం.
– డాక్టర్ ఏ.దేవేందర్రెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ దవాఖాన.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ ) : ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్, సూపర్ స్పెషాలిటీ, ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ దవాఖానలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు సర్కారు వైద్యసేవలు అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తూ ప్రసవ సమయంలో ఇబ్బందులు లేకుండా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. న్యూరాలజీ, కార్డియాలజీ, పిడియాట్రిక్, ఆప్తమాలజీ సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఆరోగ్య జిల్లాగా మారింది.
ఏజెన్సీ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం బోథ్ దవాఖానను వైద్యవిధాన పరిషత్లోకి తీసుకొచ్చి ఆస్పత్రి స్థాయికి పెంచింది. రూ.11.50 కోట్లతో నిర్మించనున్న కమ్యూనిటీ ఆస్పత్రిలో 30 పడకలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నది. కొత్తగా నిర్మించనున్న దవాఖానకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి నేడు(బుధవారం) భూమిపూజ చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతారు. మంత్రుల పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. అప్గ్రేడ్ కారణంగా ఆధునీకరణతోపాటు, వివిధ విభాగాల్లో వైద్య నిపుణులు, సిబ్బంది, పరికరాలు, పరీక్షా యంత్రాలను సమకూరుతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా బోథ్ ప్రాంతంలోని ఏజెన్సీ గ్రామాలు, మారుమూల పల్లెలవాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది.