కడెం, మే 17 : కడెం మండల కేంద్రంలో నూతనంగా చేపల మార్కెట్ విస్తరణకు చర్యలు తీసుకుంటామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. కడెం మండల కేంద్రంలో అనువైన స్థలాలను బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడి చేపల మార్కెట్ కోసం స్థలం అందుబాటులో ఉండడంతో నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కడెం ప్రాజెక్టును నమ్ముకొని అనేక మంది మత్స్యకార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో చేపలను తక్కువ ధరకు ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తూ నష్టపోతున్నారన్నారు. ఈ తరుణంలో కడెంలోనే నూతన మార్కెట్ను ఏర్పాటు చేయడం వల్ల అటు మత్స్యకారులతో పాటు, ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు జీవనోపాధిని అందించేందుకు యేటా చెరువులు, జలాశయాలు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నదన్నారు. అలాగే పెరిగిన చేపలను పట్టుకొని విక్రయించుకునేందుకు మార్కెట్లు నిర్మిస్తుననదని తెలిపారు. ఈ క్రమంలో కడెం ప్రాజెక్టును ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇక్కడ రెండు చోట్ల స్థలాలను గుర్తించామన్నారు. త్వరలోనే అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి, నిర్మాణం చేపట్టేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంథోని అలెగ్జాండర్, తహసీల్దార్ చిన్నయ్య, ఎంపీవో వెంకటేశ్, ఆర్ఐ రాజన్న, స్థానిక నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.