మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 10 : బ్రూసెల్లోసిస్ వ్యాధిని అరికట్టేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని పశు సంపదను దృష్టిలో ఉంచుకొని క్యాంపులు నిర్వహిస్తున్నారు. బ్రూసెల్లోసిస్ అనేది బ్రూసిల్లా బ్యాక్టీరియా వల్ల ఏర్పడిన ఒక రకమైన అంటువ్యాధి. ఇది జంతువులకే కాకుండా మానవులపైనా ప్రభావం చూపుతుంది. ఈ బ్యాక్టీరియా కలుషిత ఆహారం, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. పచ్చిమాంసం, శుద్ధి చేయని పాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
బ్యాక్టీరియా లక్షణాలు ఇవే..
బ్రూసెల్లోసిస్ వ్యాధికారక సూక్ష్మజీవితో కలుషితమైన మేత మేయడం, నీరు తాగడం, వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఐదో నెలలోనే గర్భం పోవడంతో పాటు గర్భాశయ సంబంధిత వ్యాధులు, జ్వరం రావడం, కీళ్లనొప్పులు, వృషణాల వాపు, మగ పశువుల్లో వంధత్వం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మనుషులకూ వ్యాప్తి ఇలా…
బ్రూసెల్లోసిస్ సూక్ష్మజీవులు మనిషికంటి పొరల ద్వారా లేదా వ్యాధి సోకిన పశువుల పాలు, వెన్న, మాంసం తినడం వల్ల వ్యాప్తి చెందుతుంది. పురుషులకు ఈ వ్యాధి సోకితే వృషణాలు వాపు వచ్చి వీర్యం సక్రమంగా విడుదల కాక సంతానోత్పత్తి జరుగదు. మహిళలకు అబార్షన్ జరుగుతుంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతాయి.
వారం పాటు..
జాతీయ పశువ్యాధి నియంత్రణ కార్యక్ర మం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసు న్న పెయ్య దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధికి టీ కాలతో పాటు గాలికుంటు వ్యాధి టీకాలు కూ డా వేయనున్నారు. జిల్లాలో 1,79,757 ఆవు లు, ఎద్దులు, లేగలుండగా, 1,05,798 బర్రె లు, దున్నలు, దూడలున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే 5,20,731 మేకలు, 1,83,526 గొర్రెలతో పాటు 2259 పందులున్నాయి. ఆయా మండలాల్లోని పశు సంపద ఆధారంగా క్యాంపులునిర్వహిస్తున్నారు.
అప్రమత్తతోనే నివారణ సాధ్యం
వ్యాధుల విషయంలో పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి. పశువుల పాకను పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త పశువును మంద నుంచి వేరు చేయాలి. బ్రుసెల్లోసిస్ అంటు వ్యాధి. ఇది పాడి పశువులు, జీవాలు, మేకలు, పందులతో పాటు మనుషులకు వచ్చే ప్రమాదం ఉంది. వ్యాక్సిన్ పశువులకు వేసే సమయంలోనూ రక్షణ పరికరాలు వినియోగించాలి. లేని పక్షంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ వ్యాక్సిన్ చుక్కలు మనిషి శరీరంపై పడితే బోద మాదిరిగా వాపులు వస్తాయి. సరైన సమయంలో టీకాలు వేయించడం వల్లే దీనిని నివారించవచ్చు. ఈ క్యాంపును పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ రమేశ్ కుమార్, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, మంచిర్యాల