మంచిర్యాల ఏసీసీ, జనవరి 18 : రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా రవాణా శాఖ అధికారి లెకల కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు -2024 బ్యానర్లు, గోడప్రతులు, స్టికర్లను ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.
ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14వ వరకు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడుపవద్దని సూచించారు. ఆటోలు, జీపులు ఇతర ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎకించుకోరాదని పేర్కొన్నారు. రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.