ట్రేడ్ లైసెన్స్ జారీ కోసం లంచం డిమాండ్ చేసిన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ కే శారద అడ్డంగా బుక్కయ్యారు. సోమవారం తన కార్యాలయంలో పత్తి వ్యాపారి విశ్వేశ్వర్ నుంచి రూ.65 వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. మూడు గంటల పాటు విచారణ చేపట్టిన అధికారులు ఆమెను కరీంనగర్లోని ఏసీబీ కోర్టుకు తరలించారు.
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 27 : మంచిర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్పెషల్ గ్రేడ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న కే శారద ట్రేడ్ లైసెన్స్ జారీ కోసం లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మంచిర్యాల పట్టణ సమీపంలోని గద్దెరాగడిలో నివాసముంటున్న విశ్వేశ్వర్ అనే పత్తి వ్యాపారి గతేడాది నవంబర్లో హనుమాన్ కాటన్ ఆగ్రో ఏజెన్సీ పేరిట లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ కే శారద కార్యాలయానికి రావాలని ఈ నెల 14న విశ్వేశ్వర్కు ఫోన్ చేశారు. లైసెన్స్ ప్రక్రియ పూర్తయ్యిందని, ఇందుకు రూ. లక్ష ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. చివరకు రూ. 80 వేలు ఇచ్చేందుకు విశ్వేశ్వర్ ఒప్పందం చేసుకున్నాడు.
అదే రోజు రూ. 15 వేలు అందజేశాడు. మిగతా డబ్బుల కోసం పదేపదే ఫోన్లు చేయగా, భరించలేని విశ్వేశ్వర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆమెను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వారం రోజులుగా నిఘా పెట్టారు. సోమవారం విశ్వేశ్వర్ చేతుల నుంచి రూ. 65 వేలు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో మూడు గంటల పాటు విచారణ జరిపారు. సాయంత్రం పోలీసుల సహకారంతో శారదను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. హైదరాబాద్లోని శారద స్వగృహంలోనూ దాడులు నిర్వహించారు. ఎవరైనా లంచం అడిగితే 9154388954, 91543 88965, 9154388964 నంబర్లకు ఫిర్యాదు చే యాలని కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కే భ ద్రయ్య సూచించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సీఐలు సునీల్, జాన్రెడ్డి, రాము, తిరుపతి, దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.