తాండూర్, ఏప్రిల్ 13 : తాండూర్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod)కు చుక్కెదురైంది. తులం బంగారం ఏది?.. రూ.2500 ఏమయ్యాయి? అని మహిళలలు ఎమ్మెల్యేను నిలదీశారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం రాత్రి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వినోద్ చెక్కులు పంపిణీ చేస్తుండగా.. మాకిచ్చిన హామీల ఊసేది అని మహిళలు ప్రశ్నించారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులను మహిళలు ఎక్కడిక్కడ హామీలు అమలు ఇంకెప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్కు కూడా మహిళల నిరసన సెగ తాకింది. తాండూరుకు చెందిన మంచెర్ల పోచమల్లు అనే మహిళ, కిష్టంపేట గ్రామానికి చెందిన శాలిగామా పద్మలు “కల్యాణ లక్ష్మి పథకంలో ప్రభుత్వం ఇస్తానన్న తులం బంగారం ఏది?, మహిళలకు మంజూరు చేస్తామన్న రూ.2,500 ఏవి?” అని ఎమ్మెల్యేను నిలదీశారు.
కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు తనను ఒక్కసారిగా నిలదీయడంతో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వినోద్ అవాక్కయ్యారు. మహిళల ప్రశ్నలను దాటవేస్తూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు కొందరు ఆ మహిళల దగ్గరికి వచ్చి.. ‘మిమ్మల్ని ఎవరు పంపించారు? బీఆర్ఎస్ వాళ్లు పంపించారా?’ అని గద్దించారు. అంతేకాదు.. మీ పథకాలను రద్దు చేస్తామంటూ వారిని బెదిరించారు.