తాండూర్ : క్షయ వ్యాధిపై అవగాహన, సత్వర వ్యాధి నిర్ధారనే రోగి ప్రాణాలను కాపాడటంతోపాటు వ్యాప్తిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. శుక్రవారం తాండూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిర పర్యవేక్షణకు వచ్చిన డాక్టర్ సుధాకర్ నాయక్ హాజరైన రోగులు, ప్రజలతో మాట్లాడారు. రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు.
జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల వెయ్యి రూపాయల చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు అని తెలిపారు.
తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిబిరంలో అవసరం ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అలాగే ఎక్స్ రే అవసరం ఉన్నవారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 102 వాహనం ద్వారా తీసుకెళ్లి పరీక్షల నిమిత్తం తిరిగి మరల తీసుకొని రావడం జరుగుతుందన్నారు. శిబిరంలో బీపీ, షుగర్, హెచ్ఐవీ, హెపటైటిస్, టీబీ పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో డాక్టర్లు జాన్సీరాణి, లక్ష్మిప్రసన్న, ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామపంచాయతీ సెక్రటరీ దివాకర్, సీహెచ్ వో వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ ఇంచార్జి మధుబాబు, టీబీ సూపర్ వైజర్ శశికాంత్, ఆకౌంటెంట్ మురళి, ఐసీటీసీ కౌన్సిలర్ జగన్మోహన్, శ్రీలత, ఆర్బియేస్కె సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, సూపర్ వైజర్లు తార, రమాదేవి, ప్రసన్న, ఏఎన్ఎంలు శోభ, తిరుపతమ్మ, దేవి, పద్మ, తిరుమల, రాజకుమారి, ల్యాబ్ టెక్నీషియన్ హాకీం, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.