చెన్నూర్, డిసెంబర్ 28 : స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 246 స్వయం సహాయక సంఘాలకు రూ.12 కోట్ల రుణాలు మంజూరు కాగా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ రుణాలతో మహిళలు ఆర్థిక సుస్థిరత సాధించాలని తెలిపారు. నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల పురోభివృద్ధికి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటానికి అవసరమైన శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో స్వయం సహాయం సంఘాలను బలోపేతం చేయటానికి తీసుకుంటున్న చర్యలు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలువాలని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని 102 గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల కోసం రూ. 15లక్షల వ్యయంతో సమ్మక్క – సారలక్క పేరుతో మహిళా భవనాలను నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి విడుతగా నియోకవర్గంలోని చెన్నూర్ మండలంలో 9 గ్రామాల్లో, కోటపల్లి మండలంలో 9 గ్రామాల్లో, భీమారం మండలంలో 5 గ్రామాల్లో, జైపూర్ మండలంలో 6 గ్రామాల్లో, మందమర్రి మండలంలో 5 గ్రామాల్లో మహిళా భవనాలను నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అలాగే నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో రూ 2కోట్లతో మహిళా భవనాలను నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, ఐకేపీ ఏపీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.