బెల్లంపల్లిరూరల్, డిసెంబర్ 25: బెల్లంపల్లి మండలంలోని పలు చోట్ల ప్రభుత్వ స్థలాల కబ్జాపై రెవెన్యూ యంత్రాంగం సీరియస్గా దృష్టి పెడుతున్నది. మండలంలోని బూదాకలన్ శివారులోగల 170 సర్వే నంబర్లో కొంతమంది రియల్టర్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఏర్పాటు చేసిన వెంచర్ను కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశాలతో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదివారం పరిశీలించారు. చదును చేసిన ప్రభుత్వ స్థలంలో వేసిన ఫెన్సింగ్ కోసం పాతిన స్తంభాలను రెవెనూ సిబ్బంది, జేసీబీతో తొలగించి వేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆధీనంలోకి తీసుకుని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల తిరుమల వెంచర్లో అనుమతి లేని వెంచర్ను గుర్తించి అక్రమ కట్టడాల నిలుపుదలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. కన్నాల శివారులో గల 60 సర్వే నంబర్లో ఐదెకరాల అసైన్డ్ భూమిని చదును చేయడంతో పాటు అందులో ఎలాంటి అనుమతి లేకుండా బోర్ ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన వ్యవహారం పై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలని చూస్తే సహించేది లేదన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.