దండేపల్లి : విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరు భద్రత సూచనలు పాటించాలని డీఈ టెక్నికల్, విద్యుత్ సేఫ్టీ ఆఫీసర్ దుర్గం మల్లేశం (Durgam Mallesham) అన్నారు. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో ఏడిఈ ప్రభాకర్ రావుతో కలిసి రైతులకు, వినియోగదారులకు విద్యుత్ భద్రతపై ఆయన పలు సూచనలు చేశారు. రైతులతో ఆయన మాట్లాడుతూ విద్యుత్ పట్ల ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే విద్యుత్ అధికారులకు తెలియజేయాలని చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలను, పంట పొలాల్లో కరెంటు వైర్లు తెగినప్పుడు ముట్టుకోకూడదని డిఈ టెక్నికల్, విద్యుత్ సేఫ్టీ ఆఫీసర్ దుర్గం మల్లేశం రైతులకు చెప్పారు. మోటారు స్టార్టర్కు ఎర్తింగు ఉండేలా చూడాలని, పొలాల వద్ద ఇనుప స్టార్టర్ బాక్సులు ఉపయోగించకూడని ఆయన సూచించారు. విద్యుత్ను సరైన భద్రత సూత్రాలను పాటిస్తూ వాడుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు. ప్రజలు ఇండ్లలో కూడా విద్యుత్ గురించి జాగ్రత్తగా, భద్రతగా ఉండాలని మల్లేశం సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట ఏడిఈ ఎం ప్రభాకర్ రావు, ఏఈ బాపు సబ్ ఇంజనీర్ సాయి నరేష్, లైన్మెన్ మల్లేష్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.