శ్రీరాంపూర్ : సింగరేణి కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే రూ. 40 లక్షల నుంచి 50 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ యాజమాన్యాన్ని కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో యాజమాన్యం, బ్యాంకు అధికారులు, టీబీజీకేఎస్ నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రమాద బీమా సౌకర్యం, తదితర సమస్యలపై చర్చించారు. కార్మికుడు ప్రమాదంలో చనిపోతే ఇదివరకు చెల్లించిన బెన్ఫిట్స్ కాకుండా అదనంగా చెల్లించాలని వెంకట్రావ్ కోరారు.
కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదంలో మరణిస్తే 20 నుంచి 30లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. బీమా సౌకర్యంపై విస్తృతంగా చర్చించామని, వారం రోజుల్లో మరో సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఇన్సురెన్స్ పథకానికి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు డబ్బులు కట్టాల్సిన అవసరంలేదని వెంకట్రావ్ పేర్కొన్నారు . ఈ సమావేశంలో డైరెక్టర్(పా) బలరాం, జీఎం పర్సనల్ ఆనందరావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, కేంద్ర ఉపాధ్యక్షులు మంద మల్లారెడ్డి, బడికెల సంపత్కుమార్, నూనె కొమురయ్య, కోశాధికారి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.