శ్రీరాంపూర్, జనవరి 13 : సింగరేణి కార్మికులకు మెరుగైన వేజ్బోర్డు సాధించడంలో జాతీయ సంఘాలు విఫలమయ్యాయని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి విమర్శించారు. ఏరియాలోని ఆర్కే-7 గనిపై శుక్రవారం నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వేతన ఒప్పందం విషయంలో జాతీయ సంఘాలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. సింగరేణి అధికారంలో ఉన్న సమయంలో కార్మికుల హక్కులు పోగొట్టారని గుర్తుచేశారు. వారసత్వ ఉద్యోగాలు పోగొడితే సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాలతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. యాజమాన్యం తీసుకొచ్చిన ‘గోల్డెన్ షేక్ హ్యాండ్’తో 20వేల ఉద్యోగాలు ఊడగొడితే జాతీయ సంఘాలుకనీసం పోరాటాలు కూడా చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక వరాలు ప్రకటించారని వివరించారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించారని గుర్తుచేశారు. అన్ఫిట్ అయిన 3,500 మందికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
16 శాతం ఉన్న లాభాల వాటాను 29 శాతానికి పెంచారని గుర్తుచేశారు. కార్మికులకు పీఎంఈ మస్టర్, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.20 లక్షల మ్యాచింగ్ గ్రాంట్, సహజ మరణానికి రూ.15 లక్షలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై టీబీజీకేఎస్ ఎప్పటికప్పుడు పోరాడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నదన్నారు. టీబీజీకేఎస్ను విమర్శిస్తే ఊరుకునేదిలేదన్నారు. జాతీయ సంఘాలకు కార్మికులు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధులు పెట్టం లక్ష్మణ్, వెంగల కుమారస్వామి, నాయకులు చాట్ల అశోక్, ల్యాగల శ్రీనివాస్, తొంగల రమేశ్, చిలివేరు సదానందం, బుస రమేశ్, మెండె వెంకటి, ప్రేంకుమార్, రాజునాయక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.