మంచిర్యాల : దఫదఫాలుగా గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ప్రతి సంవత్సరం కోటి నుంచి నాలుగు కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తూ, గట్టు మల్లన్న స్వామితో పాటు వేలాల గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మీతో కలిసి వేలాల గ్రామం నుంచి గట్టు మల్లన్న స్వామి ఆలయం వరకు రూ.2 కోట్లతో నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్.. గాంధారి మైసమ్మ ఆలయం, మందమర్రి పట్టణం ఆనుకొని సమ్మక్క – సారక్క ఆలయం, కత్తెరశాల మల్లికార్జున ఆలయం, చెన్నూరులో మధున పోచమ్మ ఆలయాలు.. చెన్నూరు నియోజవర్గంలో ఉన్నాయని వాటికీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అంతేకాకుండా వేలాల నుంచి గట్టు మల్లన్న వరకు రోడ్ల నిర్మాణాలు అవుతున్నాయని విప్ సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోయే నాలుగైదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు కోట్లు రూపాయలు మంజూరు చేయించుకొని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో రూ.20 కోట్ల అభివృద్ధిని చేయనున్నట్లు విప్ తెలిపారు. దానిలో భాగంగానే రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు సుమన్ తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైతం కోటి రూపాయలను అడగగానే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా రెండు ఎకరాల ఫారెస్ట్ స్థలాన్ని కేటాయించాలని కోరగా, మరో చోట భూమి ఇస్తే రెండు ఎకరాలు దేవాదాయ శాఖకు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు విప్ తెలిపారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీటీసీ మేడి సునీత తిరుపతి , ఏసీపీ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.