మంచిర్యాల, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కమలం పార్టీలో పక్కింటి పెత్తనం కాకరేపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలుగా ఇతర జిల్లాలకు చెందిన వారు కొనసాగుతుండగా పార్టీకి తలనొప్పిగా మారింది. లోకల్, నాన్ లోకల్ లీడర్ల మధ్య గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పటి నుంచో పార్టీ కోసం సర్వం ధారపోస్తూ కష్టపడుతుంటే.. ఇతర జిల్లా నాయకుల పెత్తనం ఏంటనీ పెదవి విరుస్తున్నారు. గతంలో పోటీ చేసిన మమ్మల్ని సపోర్టు చేయాల్సింది పోయి.. ఇతర నాయకులను ప్రోత్సహిస్తుండడం కంటగింపుగా తయారైంది. ఈ క్రమంలో ఎవరి మాట వినాలో అర్థం కాక కమలం శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇలా అధిష్టానం క్షేత్రస్థాయిలో సంప్రదింపులు లేకుండానే ఇన్చార్జిలను నియమించడంతో స్థానిక లీడర్లు అసంతృప్తితో ఉన్నారు.దీంతో బీజేపీలో ఉండి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్న నాయకుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. రెంటికి చెడ్డ రేవడిగా తయారైందని చర్చించుకుంటున్నారు.
మంచిర్యాల, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జిలుగా ఇతర జిల్లాలవారు కొనసాగుతున్నారు. బోథ్కు పొల్సాని సుగుణాకర్రావు(కరీంనగర్) ఇన్చార్జి కాగా.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్(జగిత్యాల జిల్లావాసి) కొనసాగుతున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడు పర్యాయాలు పాయల్ శంకర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక కమలం శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఆసిఫాబాద్కు శ్రీకాంత్(హైదరాబాద్), సిర్పూర్ కాగజ్నగర్కు రాజమౌళిగౌడ్(వరంగల్) ఉన్నారు. దీంతో ఆసిఫాబాద్కు చెందిన ఆత్మారాంనాయక్, సిర్పూర్కు చెందిన హరీశ్బాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బలవంతంగా ఇన్చార్జిలతో కలిసి పని చేస్తున్నారని వారి సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు. మంచిర్యాల ఇన్చార్జి పల్లె గంగారెడ్డి(నిజామాబాద్) ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన రఘునాథరావు పరిస్థితి ఏంటనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిర్మల్కు నాయుడు ప్రకాశ్(హైదరాబాద్ కంటోన్మెంట్), ముథోల్కు మహేశ్బాబు(జగిత్యాల), బెల్లంపల్లికి కౌశిక్హరి(రామగుండం), చెన్నూర్కు కటకం మృత్యుంజయం(కరీంనగర్) నుంచి వచ్చారు. కానీ.. ఈ నియోజకవర్గాల్లో అసలు బీజేపీ పార్టీ ప్రస్తావనే ఎక్కడా కనిపించడం లేదు.
తలచింది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటి..
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడానికి ఇతర జిల్లాలకు చెందిన వారిని ఇన్చార్జిలుగా నియమించామని చెబుతున్నా.. స్థానికంగా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. వీరి రాకతో నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు పెరుగగా.. టికెట్ ఆశిస్తున్న వారిని కాకుండా ఇతర వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అపవాదు ఉంది. దీంతో దిగువ శ్రేణి నాయకులు అయోమయానికి గురవుతున్నారు. ఎవరి వైపు మొగ్గు చూపాలో తెలియక తికమక అవుతున్నారు. కేడర్ ముక్కలుగా చీలిపోయే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధిష్టానం అందరిని కలుపుకొని వెళ్లాలని పంపిస్తే.. ఇన్చార్జిలు స్థానికంగా చేస్తున్నది మరోలా ఉందని క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగుతున్నది. ఇలాగైతే పార్టీ మనుగడమే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇన్చార్జిల్లో టెన్షన్.. టెన్షన్..
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగుతున్న వారంతా.. వారి సొంత నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారే ఉన్నారు. అనాదిగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులే అధికం. తమకు అదనంగా ఇతర నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారని సంబురపడుతుండగా.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ బాంబ్ పేల్చారు. నియోజకవర్గ ఇన్చార్జిలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ షాక్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే బన్సల్ ఈ ప్రకటన చేశారు. తమను సొంత నియోజకవర్గాల నుంచి దూరం చేయాలనే కుట్రలో భాగంగా ఇన్చార్జిలుగా నియమించారనే భావన ఇన్చార్జిలలో వ్యక్తమవుతున్నది. దీంతో కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లమంటూ పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు తెలిసింది. అలా కాదని ఒత్తిడి చేస్తే తిరుగుబాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
రెంటికి చెడ్డ రేవడి..
బీజేపీ సీనియర్ నేత సుగుణాకర్రావు వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేశారు. కానీ.. ఆయనను బోథ్ ఇన్చార్జిగా నియమించారు. అలాగే కటకం మృత్యుంజయం, కౌశిక్ హరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మిగిలిన నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా వేరే చోట టికెట్టు ఆశిస్తున్న వారే ఉన్నారు. కానీ.. బన్సల్ మాటల ప్రకారం వీరంతా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. తాము పోటీ చేసే నియోజకవర్గాలను వదిలిపెట్టి, ఇన్చార్జిలుగా నియమించిన నియోజకవర్గాలకు వెళితే సొంత నియోజకవర్గాల్లో పరిస్థితి చేజారుతుందన్న ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతున్నది. ఈ పరిణామాలు రెండు వైపులా పార్టీకి నష్టమే చేస్తాయనే ఆందోళన క్షేత్రస్థాయి పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. మొత్తానికి ఇన్చార్జిల నియామకం బీజేపీలో కాకరేపుతోంది.