మంచిర్యాల, ఆగస్టు 7, నమస్తే తెలంగాణ : వృద్ధాప్య పింఛన్ వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వజ్రోత్సవాలను పురస్కరించుకొని దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఈ నెల 15వ తేదీ నుంచి పింఛన్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. పంద్రాగస్టున ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కొత్తగా 71,382 మందికి ప్రయోజనం చేకూరనున్నది. సమైక్యపాలనలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.200 మాత్రమే పింఛన్ వచ్చేది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మొదటిసారి రూ.వెయ్యి చొప్పున ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్నారు.
ఇప్పటికే 3,26,735 మందికి పెన్షన్లు..
ఆసరా పథకంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3,26,735 మంది లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధాప్య పింఛన్కు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభు త్వం నిర్ణయించడంతో కొత్తగా అనేకమంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,26,735 మంది లబ్ధిదారులు ఉండగా, అర్హత వయసు 57 ఏండ్లకు కుదించడంతో అదనంగా 71,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 82,420 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తగా 17,316 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 63,805 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా, 16,461 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో 1,35,169 మందికి పింఛన్లు ఇస్తుండగా, 25,264 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 45,341 మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా, కొత్తగా 12,341 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ ఫింఛన్లు మంజూరు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ సర్కారుకు రుణపడి ఉంటామని లబ్ధిదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.