మంచిర్యాల ఏసీసీ/భైంసా, జూలై 28: శ్రావణమాసం.. తెలుగు వారికి ఎంతో విశిష్టత కలిగింది. ఇళ్లన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతాయి. నోములు, పూజలతో ఇంటింటా మహిళలు నిష్టతో గడుపుతారు. ఇక కొత్త దంపతులకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది ఈ మాసం. ఎండలు వెళ్లిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమవుతారు. శ్రావణమాసాన్ని లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఇంటి ఆడబిడ్డలతో మంగళవారం గౌరీ పూజలు చేయించడం.. మెట్టినింట తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మి పూజను కోడలితో చేయించడం ఇలా అమ్మవారి అంశంగా ఆడ పిల్లలకు పుట్టినిల్లు, మెట్టినిల్లు గౌరవం ఇచ్చి శ్రావణమాసంలో సంతోషంగా గడిపుతారు.
శ్రావణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేది శ్రావణ మాసం. ముక్కంటికి అత్యం త ప్రీతిపాత్రమైనది, అలాగే శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడా శ్రావణమే. శ్రీకృష్ణడు అవతరించింది.. బలి చక్రవర్తి పట్టాభిఫేకం జరిగింది కూడా ఈ మాసంలోనే. శ్రావణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీమహా విష్ణువుని పూజిస్తాడని అంటారు. అందుకే శ్రావణ మాసం ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజుకూ విశిష్టత ఉంది.
శ్రావణ మంగళవారం..
అభయమిచ్చే హనుమంతుడు, మొదటి పూజలందుకునే విఘ్నేశ్వరుడు. సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్యుడు మంగళవారమే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. మంగళ గౌరీకి ఎంతో ఇష్టమైనది మంగళవారం. ఆయా దేవతలందరినీ భక్తిశ్రద్ధలతో పూజిస్తే శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా మహిళలు మంగళగౌరీ వ్రతాలతో చేసి తమ భక్తి ప్రవృత్తులను చాటుకుంటారు.
శ్రావణ శుక్రవారం..
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి శుభప్రదమైనది. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లెమాలను సమర్పిస్తే సకల పాపాలు తొలగుతాయన్నది భక్తుల నమ్మకం. అలాగే రుణ విముక్తి, లక్ష్మీకటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
మంగళగౌరీ వ్రతం : కొత్తగా పెళ్లయిన యువతులు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూజా మందిరంలో తూర్పు ముఖంగా మండపం ఏర్పాటు చేసి మంగళగౌరీని పూజిస్తారు.
వరలక్ష్మీ వ్రతం : ఆగస్టు 5న ఆచరించే అతి ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. కొబ్బరికాయకు పసుపు పూసి అమ్మవారి ఆకారానికి పూజలు చేస్తారు.
మహాలింగార్చన : సోమవారం సాయంత్రం ప్రదోష కాలపూజ సందర్భంగా మహాలింగార్చన ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొదటి, రెండు, నాలుగో సోమవారాల్లో, శ్రీ భీమేశ్వరాలయంలో మహాలింగార్చన జరుగుతుంది.
శాస్త్రీయత : శ్రావణ వచ్చే సమయంలో నేలంతా చిత్తడిగా మా రుతుంది. భారీ వర్షాలు పడే అవకాశముంటుంది. ఈ సమ యంలో నీరు కలుషితమవుతుంది. డయేరియా, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నది. ఆధ్యాత్మికత పేరిట పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, శాఖాహారం భుజించడంలాంటి నియమాలు పాటించడం వల్ల ఇంటిల్లిపాదీ ఆయురారోగ్యాలతో ఉండవచ్చు.
పండుగలివే..
ఆగస్టు 2న నాగుల పంచమి, 5న వరలక్ష్మీ వ్రతం,7న స్నేహితుల దినోత్సవం,8 శ్రావణ పుత్రదా ఏకాదశి, 12న రాఖీ పౌర్ణమి,15న సంకట చతుర్థి, 19న శ్రీకృష్ణాష్టమి, 27న పొలాల అమావాస్య, 31న వినాయక చవితి
శ్రావణ మాసం ఎంతో శ్రేష్టం
శ్రావణ మాసంలో చేసే పూజలు ఎంతో శ్రేష్టమైనవి. ఈ మాసంలో వచ్చే పండు గలకు పురాణాల్లో గొప్ప విశిష్టత ఉంది. మహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతి కరమైన మాసం శ్రావ ణం. భక్తిశ్రద్ధలు, నియమ నిష్టలతో ఆచరించే పూజలతో భగవంతుని కృపకు పాత్రులవుతారు. -శిరిన్ బేలే, పురోహితుడు