జిల్లాలో వారం నుంచి కురుస్తున్న వర్షం గురువారం కాస్త ఊరట నిచ్చింది. భారీ వర్షాలకు ఇప్పటికే పలు చోట్ల రోడ్లు, వంతెనలు, కల్వర్టులు తెగిపోయాయి. పొలాల్లోకి వరద చేరడంతో పంటలు కొట్టుకుపోయాయి. వరద తగ్గకపోవడంతో రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ముంపునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
కౌటాల, జూలై 14 : మండల సరిహద్దులోని పెన్గంగ, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తుమ్డిహట్టి వద్ద ప్రాణహిత ఉప్పొంగి, భూమికి సమాంతరంగా ప్రవహిస్తోంది. తాటిపల్లి, విర్ధండి, గుండాయిపేట గ్రామాల సరిహద్దులో పెన్గంగ వరద ఉధృతి పెరగడంతో సమీపంలోని పొలాలు నీట మునిగాయి. తహసీల్దార్ రాంలాల్, ఎస్ఐ మనోహర్ ఆయా గ్రామాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు, రైతులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. విర్దండి గ్రామంలో నీరు పొలాల్లోకి రావడంతో సర్పంచ్ మడావి రేణుక, గ్రామ మహిళలతో కలిసి వర్షాలు తగ్గాలని గంగమ్మ తల్లికి పూజలు చేశారు. వారి వెంట ఆర్ఐ దేవేందర్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
ఉధృతంగా పెనుగంగ
పెన్గంగ ఉధృతి పెరగడంతో సిర్పూర్(టీ) మండలం పారీగాం వాగుపై బ్యాక్ వాటర్ రావడంతో కౌటాల నుంచి సిర్పూర్ – కాగజ్నగర్ వెళ్ల్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కౌటాల, చింతలమానేపల్లి మండలాల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలకు అంతర్రాష్ట్ర వంతెన, లోలెవల్ వంతెనలపై నుంచి వరద ప్రవహిస్తుండంతో మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్(టీ) – పోడ్సా అంతర్రాష్ట్ర వంతెన వెంకట్రావ్పేట్ వద్ద బ్రిడ్జిపై నుంచి పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తుండంతో మహారాష్ట్ర వైపునకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. సిర్పూర్(టీ) – హుడ్కులీ లోలెవల్ వంతెనపై నుంచి వరద పారుతుండడంతో మండకేంద్రం నుంచి జక్కాపూర్, మాకిడి, మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పారీగాం గ్రామం పెన్గంగ బ్యాక్ వాటర్ భారీగా చేరడంతో రోడ్డ్యాంపై నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల, బెజ్జుర్, మహరాష్ట్ర ప్రయాణికులు ఇటువైపు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మండలకేంద్రంలోని మేదరీవాడ, గోవింద్పూర్ కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. తహసీల్దార్ రవీందర్, ఎస్ఐ రవి కుమార్, వీఆర్వోలు నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జక్కాపూర్, హడ్కులీ, నవేగాం, వెంకట్రావ్పేట్, పారీగాం గ్రామాల్లోని పత్తి పంటలు పూర్తిగా నీటమునిగాయి.
తుంపల్లి వంతెన పరిశీలన ..
మండలంలోని తుంపల్లి వాగు వంతెన దెబ్బతిన్నది. దీంతో ఎమ్మెల్యే ఆత్రం సక్కు వంతెనను గురువారం సందర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సత్వరమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.
మరమ్మమతులు చేపట్టాలి..
మండలంలోని తుంపల్లి వాగు వంతెన మరమ్మతులు వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు సూచించారు. ఎంపీపీ మల్లికార్జున్, ఎంపీడీవో శశికళతో కలిసి గురువారం వంతెనను పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం అంకుసాపూర్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పంట నష్టంపై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి, కలెక్టర్కు నివేదికలు అందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. వైస్ ఎంపీపీ పెంటయ్య, సర్పంచ్ వినోద్, ఎంపీటీసీ మల్లేశ్, నాయకులు గోపాలా నాయక్, రాము గౌడ్, సత్యనారాయణ, శ్రీశైలం ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని రెబ్బెన జడ్పీటీసీ వేముర్ల సంతోష్, తహసీల్దార్ రియాజ్అలీ సూచించారు. మండలకేంద్రంలో కూలిపోయిన ఇండ్లను గురువారం పరిశీలించారు. వర్షం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లిన రెవెన్యూ అధికారుల దృష్టి కి తీసుకురావాలని సూచించారు. ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఆర్ఐ రాజు, వార్డు సభ్యులు గోపి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు నవీన్కుమార్జైస్వాల్, అజయ్జైస్వాల్, అన్నపూర్ణ మురళీగౌడ్ ఉన్నారు.
ప్రాణహిత బ్యాక్ వాటర్తో రాకపోకలు బంద్..
మండలంలో బుధవారం కాస్తా తెరిపినిచ్చిన వర్షం గురువారం ఉదయం నుంచి మళ్లీ కురుస్తున్నది. వాగులు, వంకల్లో వరద తగ్గినప్పటికీ ప్రాణహిత ఉధృతంగా ప్రవహించడంతో తలాయి గ్రామ సమీపంలో వాగులో బ్యాక్ వాటర్ నీటి మట్టం పెరుగుతున్నది. దీంతో పాపన్పేట నుంచి తలాయి, తిక్కపల్లి గ్రామాల మీదుగా సోమిని, మొగవెళ్లి తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదేవాగుపై తలాయి-పాత సోమిని గ్రామాల మధ్య ఇటీవల నిర్మించిన హైలెవల్ వంతెన బ్యాక్ వాటర్తో మునిగిపోయింది. ఒక వైపు సోమిని బెజ్జూర్ రోడ్డు ద్వారా లోతు ఒర్రె, సుస్మీర్ ఒర్రె రెండూ కూడా పొంగడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోగా, ఆయా గ్రామాల ప్రజలు తలాయి, తిక్కపల్లి మీదుగా బెజ్జూర్ మండల కేంద్రానికి వచ్చేవారు. కానీ గురువారం బ్యాక్ వాటర్ పెరగడంతో రాకపోకలు స్తంభించాయి.
ముంపు గ్రామాల పరిశీలన..
ప్రాణహిత బ్యాక్ వాటర్తో తలాయి, తిక్కపల్లి గ్రామాలతో పాటు రహదారులు, పొలాలు ముంపునకు గురయ్యాయి. గురువారం తహసీల్దార్ జమీర్ ఎస్ఐ వెంకటేశ్తో కలిసి ఆ యా ప్రాంతాలను సందర్శించారు. నీట మునిగిన పొలాలతో పాటు ముంపు ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరద తగ్గిన అనంతరం పంట నష్టం సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, సహకార సంఘం మాజీ చైర్మన్ డోకె వెంకన్న, పాపన్పేట సర్పంచ్ బుజాడి శేఖర్, టీఆర్ఎస్ నాయకులు పుల్లూరి సతీశ్ కుమార్, రేణుకుంట్ల పెంటయ్య, బోర్కుట్ తులసీరాం, రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధాన రహదారిపై బురద తొలగింపు ..
పెంచికల్పేట్ , జూలై 14 :మండలకేంద్రంలోని పెంచికల్పేట్-కాగజ్నగర్ ప్రధాన రహదారిపై బొంబాయిగూడ నుంచి ఎల్కపల్లి వరకు రోడ్డుపై బురద పేరుకుపోయింది. గురువారం వరద తగ్గుముఖం పట్టడంతో ఎస్ఐ రమణ్కుమార్ ఆధ్వర్యంలో స్థానికుల సహకారంతో ట్రాక్టర్ ద్వారా బురదను తొలగించి రాకపోకలు కొనసాగించే చర్యలను చేపట్టారు. ఎస్ఐతో పాటు డీటీ రఘునాథ్రావు, ఆర్ఐ గోపాల్ పాల్గొన్నారు. అదే విధంగా అగర్గూడ గ్రామంలో రెండు రోజుల క్రితం పడిపోయిన విద్యుత్ స్తంభాలను సర్పంచ్ పాలె సుధాకర్ ఆధ్వర్యంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయించి గ్రామానికి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
రైతులు అధైర్య పడవద్దు : ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
దహెగాం, జూలై 14 : రైతులు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే కోనే రు కోనప్ప అన్నారు. మండలంలోని దహెగాం, లగ్గాం, ఒడ్డుగూడ, ఐనం, పెసర్కుంట తదితర గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. సీఎంతో మా ట్లాడి పరిహారం అందేలా చూస్తానని హామీనిచ్చారు. నష్టం జరిగిన పత్తి పంట చేనుల్లో వేరే పంటలు వేసుకునేందుకు రైతులు సన్నద్ధ కావాలని సూచించారు. పెసర్కుంట పరిస్థితిని ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, తహసీల్దార్ రామ్మోహన్రావు, డీఎల్పీవో రాజేశ్వర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రసాద్రాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతుకు చర్యలు : అదనపు కలెక్టర్
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి అన్నారు. మండలంలోని దహెగాం, ఐనం, బీబ్రా, పెసర్కుంట గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ముందుగా రెస్క్యూ టీం సభ్యులు గల్లంతైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఐనం గ్రామంలో పర్యటించిన అనంతరం బీబ్రా సమీపంలోని తెగిపోయిన దహెగాం, కాగజ్నగర్ ప్రధాన రహదారిని పరిశీలించారు.అదేవిధంగా పెసర్కుంట రోడ్డు పూర్తిగా తెగిపోడంతో నడుచుకుంటూ వరదలతో దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తూ గ్రామానికి చేరుకున్నారు. వర్షాకాలంలో పెద్దవాగుతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్తులు ఆమెకు విన్నవించారు. తమ గ్రామానికి వేరే చోట పునరావాసం కల్పించాలని, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని నష్టపరిహారం అందించాలని కోరారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ ధ్వంసమైన రోడ్లకు చెందిన నివేదికలను కలెక్టర్కు అందజేసి మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో పంటనష్టం సర్వే చేయిస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. వరదలు ఎక్కువైతే ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో తెగిపోయిన రోడ్లు, పంటనష్టం, తదితర సమస్యలను జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు అదనపు కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో డీఎల్పీవో రాజేశ్వర్గౌడ్, సర్పంచ్లు బండ కృష్ణమూర్తి, నక్క పద్మ పాల్గొన్నారు.
పంటల పరిశీలన
వాంకిడి, జూలై 14 : మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను వాంకిడి జడ్పీటీసీ అజయ్ కుమార్ గురువారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ జబురే పెంటయ్య, నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.
చింతలమానేపల్లిలో..
చింతలమానేపల్లి , జూలై 14 : రణవెల్లి-టేకంగూడ వాగును తహసీల్దార్ మునావర్ షరీఫ్, ఎస్ఐ విజయ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, ఒర్రెల వద్దకు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.