కోటపల్లి, జూలై 14 : గోదావరి, ప్రాణహిత వరద బాధితులు అధైర్యపడొద్దని, ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భరోసానిచ్చారు. గోదావరి ప్రవాహం జాతీయ రహదారి నం.63 మీదుగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోటపల్లి మండలానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతీ హోలికేరితో కలసి పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. చెన్నూర్ మండలంలోని అక్కెపల్లి, చింతలపల్లి, కోటపల్లి మండలంలోని రాంపూర్, దేవులవాడ, బబ్బెరచెలుక, బోరంపల్లి, వెలమపల్లి, లక్ష్మీపూర్, ఎర్రాయిపేట, అర్జునగుట్ట గ్రామాలు ము ంపులో చిక్కుకోగా ప్రత్యేక బోట్ల ద్వారా వెళ్లి అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ వర్షాలు తగ్గి, వరద తీవ్రత తగ్గే వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని, వరద బాధితులు అధైర్య పడవద్దని సూచించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ తాను ఇక్కడే ఉంటానని సుమన్ చెప్పారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తనకు తెలియజేయాలని సూచించారు. వరదల కారణంగా గ్రామాలలో చిక్కుకున్న ఐదుగురు బాదితులు అనార్యోగానికి గురికాగా బాల్క సుమన్ తెప్పించిన బోట్లలో దవాఖానకు తరలించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి
చెన్నూర్ నియోజకవర్గాన్ని వరదలు చుట్టిముట్టినందున అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. లోతట్టు గ్రామాల పునరావాస కేంద్రాలు, వసతులు, సహాయ చర్యల పైన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విప్ బాల్క సుమన్ సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి నది ప్రవాహం గ్రామాలను ముచెత్తిందని చెప్పారు. ప్రస్తుత సమయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాలను ముందుగానే ఖాళీ చేయడం వల్ల అందరినీ సురక్షితంగా ఉంచగలిగామని తెలిపారు. పునరావాస కేంద్రంలో బాధితులకు వసతులు కల్పించాలన్నారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల పరిస్థితులను తెలుసుకున్నామని తెలిపారు. సోమన్పల్లి సమీపంలోని గోదావరి నదిలో ఇద్దరి చిక్కుకోగా, ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సమయానికి హెలిక్యాప్టర్ పంపించారని తెలిపారు. ఆ ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో వరదలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సింగరేణి రెస్యూ టీం కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక ఎక్స్గేషియా ఇవ్వాలని విన్నవించినట్లు చెప్పారు. చెన్నూర్లోని హబీబ్ ఫంక్షన్ హాల్, సంతోషిమాత ఫంక్షన్ హాల్, ఎంఆర్ఆర్ ఫంక్షన్హాళ్లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కలెక్టర్ భారతీ హోళికేరీ గురువారం పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.