హాజీపూర్ : ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కొవిడ్ నిబంధనలను పాటిస్తు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్, ప్రతిభ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ నిబంధనలను పాటించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్ ఇతరాత్రా సౌకర్యాల కల్పనతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి రోజు గదులను శానిటైజ్ చేయాలని, అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని, పరీక్షా కేంద్రాల చుట్టు ఉండే జిరాక్స్ సెంటర్లను పరీక్ష జరిగే సమయంలో మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు, కస్టోడియన్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని పేర్కొన్నారు. మొత్తం 8 వేల 367 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.