శ్రీరాంపూర్ : హుజురాబాద్ నియోజక వర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిస్తేనే నియోజక వర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు డీకొండ అన్నయ్య పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్రెడ్డి, కే. వీరభద్రయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్లతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణా ముందుందన్నారు.
సింగరేణి ప్రాంతంలో కార్మికులు అనేక మంది ఈ ప్రాంతాలకు చెందిన వారున్నారని చెప్పారు. పదవీ విరమణ పొందిన వారు చాలా మంది సొంత గ్రామాలకు వచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు పొందుతున్నారని చెప్పారు. వారి పిల్లలు కూడా కారుణ్య ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. నియోజక వర్గంలోని ప్రతీ దళితునికి దళిత బంధు ద్వారా రూ. 10 లక్షలు అందిస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని వారు కోరారు.