మంచిర్యాల, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా అడవులు పులుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా మారింది. పక్కనున్న ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ నుంచి బెల్లంపల్లి, చెన్నూర్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తుండడంతో అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. వాటి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. టైగర్ రిజర్వు ఫారెస్ట్లో మాత్రమే ఉండే సోలార్ సీసీ కెమెరాలను ఇటీవల మంచిర్యాల జిల్లాలోని అడవుల్లో ఏర్పాటు చేసింది. చెన్నూరు, బెల్లంపల్లిలో పులుల ఎంట్రీ పాయింట్స్ వద్ద 25కుపైగా సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 64జీబీ మెమొరీ కార్డు సైతం ఉంటుంది. పూర్తిగా సోలార్ పవర్తో నడిచే ఈ కెమెరాలు 24/7 లైవ్స్ట్రీమింగ్ చేస్తుంటాయి. అంటే.. సంబంధిత అధికారులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూర్చొని అడవుల్లో తిరుగుతున్న పులులు, ఇతర వన్యప్రాణులను పరిశీలించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పులులు, వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లే వారిని సైతం గుర్తించవచ్చు.
600 సీసీ టీవీ కెమెరా ట్రాప్స్..
పులులు సంచరించే జన్నారం, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అడవుల్లో 600పైగా సీసీటీవీ కెమెరా ట్రాప్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. 2/2(రెండు కిలోమీటర్లు/రెండు కిలోమీటర్లు) గ్రిడ్ మోడల్లో నిరంతరం వాటిని పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు 120 మం ది ట్రాకర్లు, బేస్ క్యాంప్ వాచర్లు పులుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దాదాపు 60గ్రిడ్ల నుంచి రోజువారీ రిపోర్ట్ ఉన్నతాధికారులకు వస్తుంది. పులి ఆ గ్రిడ్ పరిధిలో ఎంతసేపు ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది..వంటి రిపోర్ట్ను తెప్పించుకుంటున్నారు.
పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
అటవీశాఖ అధికారులు పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది పొడవునా ఆహారం దొరికేలా గడ్డిమైదానాలను విస్తరిస్తున్నారు. ఇప్పటికే జన్నారంలో 600 హెక్టార్లు, బెల్లంపల్లిలో 100, చెన్నూరులో 100, మంచిర్యాలలో 150 హెక్టార్లలో గడ్డి మైదానాలు బాగు చే యగా, ఈ ఏడాది చివరి నాటికి మరో 300 హెక్టార్ల నుంచి 400 హెక్టార్ల వరకు గడ్డి మైదానాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికి తోడు పులులకు ఎప్పటికీ తాగునీరు దొరికేలా నీటి కుంటలు, చెక్ డ్యామ్లు ఏర్పాటు చేశారు. పులులు సంచరించే అడవుల్లో ప్రతి 2/2 స్కేర్ కిలోమీటర్లకు ఒక వాటర్ పాయింట్ పెట్టారు. ఏడాది పొడవునా ఈ పాయింట్లలో నీళ్లు ఉంటాయి. పులులు తిరిగే అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఈ వాటర్ పాయింట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు గడ్డి మైదానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ మైదానాలున్న ప్రాంతాల్లో శా కాహార జంతువుల సంఖ్య గణనీయంగా పెరగింది. చుక్కల దుప్పులు, నీలుగాయిలు, బ్లూ బక్, అడవి పందుల ఎక్కువయ్యాయి. దీంతో పులులు వేటాడుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. ఇటీవల జిల్లాలో పర్యటించిన మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ (ఎంఈ) టీం సైతం మన అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య భారీగా పెరిగిందని నిర్ధారించింది.
త్వరలో మరిన్ని సోలార్ సీసీ టీవీ కెమెరాలు
చెన్నూరు, బెల్లంపల్లి అడవిలో ఏర్పాటు చేసిన సోలార్ సీసీ టీవీ కెమెరాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పులల కదలికలతో పాటు వన్యప్రాణుల కదలికలు అందులో రికార్డు అవుతున్నాయి. ఈ కెమెరాలు ఏర్పాటు చేశాక కలప రవాణా సైతం తగ్గింది. ఆర్గనైజింగ్ క్రైమ్ అనేది లేదు. అందుకే త్వరలోనే మరిన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పులుల సంరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పని చేస్తున్నాం.
– శిశ్ ఆశిష్ సింగ్, డీఎఫ్వో మంచిర్యాల