తాండూర్, ఏప్రిల్ 29 : క్షయ వ్యాధిపై అవగాహన, సత్వర వ్యాధి నిర్ధారణే రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. బుధవారం తాండూర్ పీహెచ్సీ వైద్యురాలు ఝాన్సీరాణి ఆధ్వర్యంలో మాదారం సర్పంచ్ కుశ్నపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్నారు.
క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల వేయి రూపాయల చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. క్షయ వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేస్తూ పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సత్తయ్య, క్షయ వ్యాధి డివిజన్ సూపర్వైజర్ శ్రీపెల్లి కలకాంత్, గ్రామపంచాయతీ సెక్రటరీ అల్లాద్దీన్, హెల్త్ సూపర్వైజర్ తార, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ హాకీం, ఏఎన్ ఎంలు పుష్పలత, పద్మ, శ్రవంతి, ఆశా కార్యకర్తలు కవిత, జయ, మల్లీశ్వరి, లక్ష్మి, సావితి, వైఆర్టీ కేర్ ఎల్ డబ్ల్యూలు సరళ, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.