తాండూర్, మే 12 : పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల జిల్లా డీసీపీ ఎక్కడి భాస్కర్ అన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడ వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టును డీసీపీ ఏగ్గడి భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు. చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి వాహన వివరాలు రిజిస్టార్ లో నమోదు చేయాలనీ సూచించారు. అక్రమ పశువుల రవాణాపై పటిష్ట నిఘా ఉందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా ఉంటే స్థానిక పోలీస్ వారికీ, 100కు కాల్ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, తాండూర్ ఎస్ ఐ ప్రసాద్, ఉన్నారు.