మంచిర్యాల : మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ. వందల ఏండ్లుగా ఈ గడ్డపై హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. తాజాగా జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ శ్రీ విజయ గణపతి దేవాలయంలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. గత మూడ సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు భోజన ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హిందూ, ముస్లిం భాయ్ బాయి అనే సోదరభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
అనంతరం గురుస్వామి రంగచారి మాట్లాడుతూ.. భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి మత సామరస్యం చాటుతామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సభ్యులు ఖాజా, సలీమ్, పాషా, షఫీ, ఆరిఫ్, ఇమ్రాన్, మోహిద్, ఇందాస్, కలీమ్, గౌస్, ఇమామ్ అజ్గర్ ఆలీ, ముఖ్య అతిథిగా క్యాతనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎర్రం విధ్యా సాగర్ రెడ్డి, యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్, యువ నాయకులు రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.