కాసిపేట, మే 5 : విద్యతోనే గౌరవంతో పాటు ఆత్మ విశ్వాసం పెరుగుతుందని వయోజన విద్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాసిపేట మండలం (లంబాడితండా (ఎస్) ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వయోజన విద్యా రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఏ పురుషోత్తం నాయక్, సర్పంచ్ బోడ బలరాం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన 265 మంది మహిళలకు శ్రీనివాస్ రెడ్డి, స్సీఈఆర్టీ ప్రొఫెసర్, మాజీ డీఈవో రవి కాంత్, డిప్యూటీ డైరెక్టర్ ఏ పురుషోత్తం నాయక్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత విజయవంతంగా పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, వయోజన విద్య శాఖను అభినందించారు. కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన వారు నిరక్షరాస్యులకు చదువు నేర్పడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. చదువుతోనే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, చదువు నేర్చుకోవడంతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర వయోజన విద్యాశాఖ రాష్ట్ర ఉప సంచాలకులు ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కాసిపేట మండలాన్ని వంద శాతం అక్షరాస్యత కార్యక్రమానిన విజయవంతం చేశామని, చదువు నేర్పిన మహిళలకు ఫలితంగా కుట్టు శిక్షణ నేర్పించామని తెలిపారు. కార్యక్రమంలో ముందుగా అధికారులకు మహిళలు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, ఎస్సీ కార్పోరేషన్ డీఈ దుర్గ ప్రసాద్, మండల స్పెషల్ ఆఫీసర్ నిరాటి రాజేశ్వరి, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, సర్పంచ్ బోడ బలరాం, కల్వల శరత్ కుమార్, నీలా రాంచందర్, ఏపీఎం రాజ్ కుమార్, డీఆర్పీలు బండ శాంకరి, సుమన్, జనార్ధన్, ఉప సర్పంచ్ పరుశురాం, తదితరలు పాల్గొన్నారు.