మంచిర్యాల, నమస్తే తెలంగాణ/బెల్లంపల్లి టౌన్/మందమర్రి/రామకృష్ణాపూర్/మంచిర్యాల ఏసీసీ, మార్చి 4 : ‘కేంద్ర సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ బడాబాబులకు అప్పజెప్పుతున్నది. ఇందులో భాగంగా బొగ్గుబాయిలను కూడా మింగాలని చూస్తున్నది. కలిసికట్టుగా పోరాడి సింగరేణిని కాపాడుకుందాం. కేంద్రం కుట్రలను తిప్పికొడుదాం’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మొదట మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రూ.94 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ (గ్రిడ్) కార్యాలయ భవనం, నిర్మాణంలో ఉన్న 100 పడకల దవాఖానను పరిశీలించారు.
అనంతరం మందమర్రికి చేరుకొని రూ.2.04 కోట్లతో చేపడుతున్న మహిళా భవన్, రూ.1.35 కోట్లతో 24 వార్డుల్లో బతుకమ్మ గ్రౌండ్లకు, రూ. 9.12 కోట్లతో 8 కమ్యూనిటీ భవనాలు, రూ 1.35 కోట్లతో 24 వార్డుల్లో బతుకమ్మ మైదానాలు, రూ.2.38 కోట్లతో సీసీ రోడ్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ. 1,.7 కోట్లతో సమ్మక్క సారలమ్మ మహిళా భవనం, రూ.2.83 కోట్లతో స్లాటర్ హౌస్, రూ.3.29 కోట్లతో 3 కమ్యూనిటీ భవనాలు, రూ.1.32 కోట్లతో ఊర చెరువు మినీ ట్యాంక్బండ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన నిర్మాణాలకు రాష్ట్ర, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంక్షేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ భారతీహోళికేరి, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయాచోట్ల ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ శాతం 7.9 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 2.2 శాతం మాత్రమే ఉందని, అన్ని రంగాల్లో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినా.. కేంద్రం మాత్రం ఆ దిశగా ముందుకెళ్లకపోవడం దురదృష్టమని, వారి కార్మిక వ్యతిరేక విధానాలకు ఇది అద్దం పడుతున్నదని తెలిపారు. సింగరేణి మనదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
సింగరేణి స్థలాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి సింగరేణి సీఎండీ, సీఎస్ సోమేశ్కుమార్తో మాట్లాడి పట్టాల మంజూరుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. డయాలసిస్ కేంద్రం, మాతా శిశు దవాఖానను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 60 ఏండ్లలో మూడు మెడికల్ కళాశాలలు మంజూరైతే టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో 17 కళాశాలలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. గర్భిణులకు మరింతగా పోషకాహారం అందించడానికి న్యూట్రిషన్ కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. అభయహస్తంలో డబ్బులు జమ చేసిన వారికి ఇదే నెలలో వారి ఖాతాల్లో జమ చేస్తామని, ఈ నెల 31లోగా స్వయం సహాయక సంఘం సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు. మహిళలకు డ్వాక్రా రుణాలకు బ్యాంక్కు లింకేజీ పెట్టామని, వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని చెప్పారు.
అభయహస్తం ద్వారా నెలనెలా డబ్బులు కడితే పెన్షన్ ఇవ్వడానికి కట్టిన డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్పీలకు 30 శాతం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కల్యాణ లక్ష్మి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 30 వేల మంది ఆడబిడ్డలకు లబ్ధిచేకూర్చినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత పథకాలున్నాయా? అని ప్రశ్నించారు. పేదలకు మోదీ చేసిందేమీ లేదన్నారు. మహారాష్ట్రలో రూ.500, గుజరాత్లో రూ.600 మాత్రమే పింఛన్లు ఇస్తుండగా, కేసీఆర్ సర్కారులో రూ.2,016తో పాటు రూ.3,016 ఇస్తున్నట్లు గుర్తుచేశారు. పలుచోట్ల ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ మెరుగైన రైల్వే వ్యవస్థ, నేషనల్ హైవే, అడవులు, సింగరేణి, గోదావరి జలాలు, అన్ని వనరులున్నా కోల్బెల్ట్ ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామికంగా ఎదగనివ్వకుండా చేశారన్నారు. కార్పొరేట్ రాజకీయాలు చేసేవారికి సింగరేణి ఒక సంస్థలా కనబడుతున్నదని, సింగరేణి ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి టీఆర్ఎస్ కంకణం కట్టుకున్నదని స్పష్టంచేశారు. నేడు బీజేపీ సిద్ధాంతాలు నచ్చకే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
అడుగడుగునా ఘన స్వాగతం..
జిల్లాలో పర్యటించిన మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులకు ప్రజ లు, నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మందమర్రిలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం భారీ బైక్ ర్యాలీ తీశారు. పాల చెట్టు దగ్గర నుంచి మోడల్ స్కూల్ గ్రౌండ్ వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళలు స్వాగతం పలికారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రెస్క్యూ స్టేషన్ నుంచి అంబేద్కర్ అంగడి బజార్ వరకు బైక్ ర్యాలీ తీశారు. భారీ గజమాలను క్రేన్ సహాయంతో వారికి వేశారు.
నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్, మార్చి 4 : నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు సర్కారు కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించారు. మొదట జైనూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. జైనూర్ ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన బాబాపూర్ వద్ద రూ. 50 కోట్లతో నిర్మించనున్న 340 పడకల ఏరియా దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 75 లక్షలతో ఏర్పాటు చేయనున్న రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్లో అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
ఇప్పటికే జిల్లా కేంద్రంలో 100 పడకల దవాఖాన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాజాగా 340 పడకలతో ఏరియా దవాఖాన ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానల్లో లభించే వైద్య సేవలు, సదుపాయాలు ఆసిఫాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో ఆసిఫాబాద్, కాగజ్నగర్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటికోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 20 సబ్ సెంటర్లకు కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఒక్కో భవనాన్ని రూ. 20 లక్షలతో నిర్మిస్తామని అన్నారు. గ్రామాల్లో సబ్సెంటర్లు నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల 3146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఉన్నట్లు తెలిపారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు శుద్ధజలం అందుతుందని, దీంతో చాలా వరకు వ్యాధులు తగ్గినట్లు చెప్పారు. త్వరలో ఇక్కడ మెడికల్ కాలేజీ మంజూరు శుభవార్తను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. కాగజ్నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించి భోజనం చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోజుల శ్రీనివాస్, కలెక్టర్ రాహుల్రాజ్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, పద్మశ్రీ అవార్డుగ్రహీత కనకరాజు పాల్గొన్నారు.