హామీ మేరకే సొంతిల్లు నిర్మాణం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
రామకృష్ణాపూర్, ఆగస్టు12 : చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం క్యాతనపల్లి పరిధిలోని రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంచిర్యాల జిల్లాను, క్యాతనపల్లి మున్సిపాలిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం నిర్మాణం చేసుకుంటున్నానని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణ కోసం జీవో 76 తీసుకురావడని దీని ద్వారా మున్సిపాలిటీలో 3941 కుటుంబాలకు లబ్ధి చేకురనుందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో వివేక్ కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. వివేక్ రోజుకో పార్టీ మార్చే ఊసరవెల్లి అన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా వివేక్ విమర్శలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకంపై వివేక్ తన వైఖరి చెప్పాలని ప్రశ్నించారు. వివేక్ కార్పొరేట్ రాజకీయాలు చెన్నూరు గడ్డపై ఇకపై నడువవు అని ఘాటుగా హెచ్చరించారు.
బడ్జెట్ను అనుసరించి త్వరలోనే దళిత బంధు పథకం రాష్ట్రం అంతటా అమలు చేస్తామని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నియోజకవర్గం బాగుపడుతుందని వివేక్ పిచ్చి కూతలు కూయడం సరి కాదని, ప్రధాని మోడీ రాజీనామా చేస్తే దేశం బాగుపడుతుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని నిరూపించాలని, దమ్ముంటే ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ చట్టం ప్రకారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎందుకు తీసుకురాలేక పోయారని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ప్రతిపక్షాలు దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా చూశాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో వంటగ్యాస్, పెట్రోల్ నిత్యావసర ధరలు రెట్టింపయ్యాయని తెలిపారు. మోడీ హయాంలో దేశం జీడీపీ బంగ్లాదేశ్ జీడీపీ కంటే తక్కువగా ఉందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని హుజూరాబాద్లో 50 వేల మెజార్టీతో గెలుపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, జడ్పీటీసీ వేల్పుల రవి, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు అబ్దుల్ అజీజ్, నర్సింగరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.