మాజీ ఎమ్మెల్సీ పీఎస్ఆర్పై ఎమ్మెల్యే దివాకర్రావు ధ్వజం
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 6: మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు పూటకోమాట మాట్లాడుతాడని, అతని మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు 2018లో ఎన్నికల్లో ఓడిపోతే సన్యాసం పుచ్చుకుంటానని మాటతప్పాడని, 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నానని ప్రగల్బాలు పలికాడని, మళ్లీ మీ ముందుకు వేరే హోదాలోనే వస్తానని డాబులు పలికాడని, కానీ ప్రజలు ఆయనను ఛీకొట్టారని అన్నారు. తననీచ పనులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, రౌడీయిజం, గూండాయిజం, పత్తాలాటలో సంపాదించిన సొమ్మును తిరిగి ప్రజలకే పంచాలని చూస్తున్నాడని ఆరోపించారు. అతని చర్యలకు ఎంతో మంది అమాయకులు బలయ్యారని, అందులో హాజీపూర్కు చెందిన హన్మంతరావు ఒకరని, ఆయనకు మాయ మాటలు చెప్పి రాంచెరువు పక్కన రూ.70 లక్షల విలువచేసే 1400 గజాల భూమిని తీసుకుని కేవలం రూ.10 లక్షలు ఇచ్చాడని, అక్కడే 500 గజాల చెరువు భూమిని ఇప్పిస్తానని మోసగించాడని ఆరోపించారు. బైపాస్రోడ్డులో తిప్పని లింగయ్య, శ్రీనివాసరెడ్డికి చెందిన భూమిలో ప్రహరీ కట్టించి కబ్జా చేయాలని చూశాడని, వారు కోర్టుల చుట్టూ తిరిగి రూ. 40 లక్షలు చెల్లించి తిరిగి ఆ భూమిని పొందారని తెలిపారు. ఇల్లు కట్టిన వారికి కూడా ఇంకా డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. ఓసారి పార్టీ మారుతానని, మరోసారి మారబోనని, మరోసారి బీజేపీలో చేరుతానని అంటాడని అన్నారు. ఇంట్లో సాయిబాబా చిత్రపటం ముందు కూర్చుని సిగరెట్ తాగుతూ ఆ పొగను వదులుతాడని, అతనికి దేవుని కృప ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తిప్పని లింగయ్య, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్చైర్మన్ ముకేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు, టీఆర్ఎస్ నాయకులు అత్తి సరోజ, శ్రీనివాస్రెడ్డి, ఎర్రంతిరుపతి, సిరిపురం శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులున్నారు.