మంచిర్యాల, జూలై 27(నమస్తే తెలంగాణ): దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా, వారి పనులు సొం తంగా చేసుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడి, క్షణక్షణం నరకయాతన పడుతున్న వారికి ఆసరాగా ఉంటున్నది. బ్యాటరీతో నడి చే ట్రై సైకిళ్లను అందజేస్తున్నది. దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులను ఎంపిక చేసి అలిమ్ కో (ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ మ్యాన్ఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), టీవీసీసీ (తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ కంపెనీ)ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నది. జిల్లాలో మొత్తం 290 మంది దివ్యాంగులను ఎం పిక చేసింది. వారికి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనాలను ప్రముఖుల సమక్షంలో నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తున్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి ఉమాదేవితో పాటు పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో 51 మందికి ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. చెన్నూర్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కలెక్టర్ భారతీ హోళికేరి, మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా, జిల్లా నాయకులు, కార్యకర్తల సమక్షంలో 46 మందికి అందజేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 177 మందికి అందజేయగా, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు వలస వచ్చి ఇక్కడే పోషణ కొనసాగిస్తున్న పలు మండలాలకు చెందిన 16 మంది దరఖాస్తు చేసుకోగా, వారికి కూడా ట్రై సైకిళ్లు మంజూరయ్యాయి. ఆయా చోట్ల బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లతో పాటు ఒక నాణ్యతతో కూడిన హెల్మెట్, చార్జర్ను పంపిణీ చేశారు. దివ్యాంగుల ఇబ్బందులను వారు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో చేతితో తిప్పుతూ వెళ్లే మూడు చక్రాల వాహనాలు పంపిణీ అయ్యేవి. ప్రస్తుతం బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేస్తుండడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాలంతో పాటు శారీరకంగా ఎంతో కలిసి వస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
20 నుంచి 40 కి.మీ ప్రయాణం..
ట్రై సైకిళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారందరినీ పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 290 మందిని గుర్తించి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తున్నా రు. ఇప్పటికే దాదాపు పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది. రూ.37 వేల విలువైన ఒక్కో ట్రై సైకిల్ను అలిమ్కో, టీవీసీసీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగానే అందజేస్తున్నారు. గతంలో పంపిణీ చేసిన వాహనాలు చేతితో తిప్పాల్సి వచ్చేది. దీంతో దూర ప్రయాణాలకు ఇబ్బందయ్యేది. శారీరక శ్రమతో పాటు సమయం కూడా ఎక్కువగా అయ్యేది. ప్రస్తుతం ఆ సమస్యలు లేకుండా బ్యాటరీతో నడిచే నాణ్యమైన వాహనాలను అందజేస్తున్నట్లు మహిళా, శిశు, వికలాంగులు, వయోవృ ద్ధుల జిల్లా సంక్షేమ అధికారి మాస ఉమాదేవి తెలిపారు. ఏదైనా సాంకేతిక ఇతర సమస్యలు తలెత్తితే తిరిగి కొత్తవి తెప్పించి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మంచి కండిషన్లో ఉన్న బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనంతో పాటు ఒక నాణ్య మైన హెల్మెట్, చార్జర్ అందజేస్తున్నట్లు ఆమె వివరించారు. బ్యాటరీ ఒక్క సారి ఫుల్ చార్జి చేస్తే వాహనం 20 నుంచి 40 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుందని, దూర ప్రయాణం చేసేవారు ముందస్తుగా చార్జి పెట్టుకోవాలని ఆమె సూచించారు.
ఇబ్బందులు తప్పినయ్
నేను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నా. మా ఊరి నుంచి రెగ్యులర్గా కాలేజీకి రావాలంటే చాలా ఇబ్బందయ్యేది. ఏవైనా వస్తువులు కొనుక్కోవాలన్నా వేరేవారికి చెప్పాల్సి వచ్చేది. దోస్తుల సాయంతో బస్సులు, ఆటోల్లో తిప్పలు పడుకుంటూ వెళ్లేదాన్ని. ఇప్పుడు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ ఇచ్చిన్రు. సమస్యలు తప్పుతయి. సొంతంగా నేనే వాహనం నడుపుకుంటూ వెళ్తున్న. నా పనులు నేనే సులువుగా చేసుకుంటున్నా.
ఎవరి మీద ఆధారపడుత లేను
నేను దివ్యాంగున్ని. కాళ్లు సరిగ్గా పనిచేయవు. బయటకు వెళ్లాలంటే ఇబ్బందయ్యేది. దుకాణానికి కూడా పోలేని పరిస్థితి. పిలగాండ్లకు పని చెబుతుంట. పింఛన్కాడికి కూడా ఎవరినైనా తోడు తీసుకొని పోత. చెన్నూర్ల నాకు సార్లు బ్యాటరీతో నడిసే మూడు గిరలు సైకిల్ ఇచ్చిన్రు. గిప్పుడు నా పింఛన్ నేనొక్కన్నే పోయి తెచ్చుకుంట. ఎవరిమీద ఆధారపడకుండా అయ్యింది.
నాణ్యమైన వాహనాలు ఇచ్చాం
జిల్లాలో 290 మంది అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే నాణ్యమైన ట్రై సైకిళ్లు అందజేశాం. హెల్మెట్తో పాటు చార్జర్ను కూడా ఇచ్చాం. వారు ఇతరులమీద ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకో వడానికి వీలుంటుంది. ఫుల్ చార్జి పెట్టుకుంటే 20 నుంచి 40 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. అలిమ్ కో, టీవీసీసీ ఆధ్వర్యంలో వీటిని అందజేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తున్నాం. మంచిర్యాలలో 177మంది, బెల్లంపల్లి 51, చెన్నూర్లో 46తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 16 మందికి సమయానుకూలంగా పంపిణీ చేస్తున్నాం.