లక్షెట్టిపేట, అక్టోబర్ 19 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, చందారం గ్రామాల్లోని పాఠశాలలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన నిర్మాణ పనులు ఆమె గురువారం పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడుతూ వసతులు, మధ్యాహ్న భోజనం, తదితర వివరాలను ఆరా తీశారు. గుల్లకోట గ్రామంలో సుమారు రూ.4 లక్షలకు పైగా నిధులు మంజూరు కాగా పనులు కూడా పూర్తి చేసినట్లు సర్పంచ్ గోళ్ల రవీందర్ కలెక్టర్కు తెలిపారు. పనులను పరిశీలించి కలెక్టర్ అభినందించారు. పెయింటింగ్ వర్క్ కూడా 15రోజుల్లోగా పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గోళ్ల రవీందర్, యశ్వంత్, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, పీఆర్ ఏఈ శృతి, హెచ్ఎంలు రవికాంత రావు, హరినాత్ తదితరులు పాల్గొన్నారు.
తొలిమెట్టు ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్య
హాజీపూర్, అక్టోబర్ 20 : పాఠశాల విద్య పూర్తయ్యేసరికి విద్యార్థులందరూ ఆయా సబ్జెక్టుల్లో నిర్ధేశించిన సామర్థ్యాలు, అభ్యాసనా ఫలితాలను సాధించే విధంగా ‘తొలిమెట్టు’ కార్యక్రమం ద్వారా కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యలో ప్రాథమిక విద్య పునాది వంటిదన్నారు. ప్రాథమిక స్థాయిలో సరైన మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన జరిగినప్పుడే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. 1 నుంచి 5వ తరగతులు బోధిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మానిటరింగ్ అధికారులు సూచించిన ఫోర్ట్నైట్ ఎఫ్ఎల్ఎన్ కార్యాచరణ, నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్ యాజమాన్యాల పరిధిలో 503 ప్రాథమిక పాఠశాలలు, 96 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 22 వేల 44 మంది విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. వరుసగా వచ్చే 6 పని దినాలలో 5 రోజులు బోధనాభ్యాసన, 1 రోజు మూల్యాంకనం కోసం కేటాయించి ప్రగతి నమోదు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు బోధించే విషయాలను ప్రాక్టీస్ చేయించాలని, ఆటలు, పాటలు ఇతర కార్యక్రమాల్లో ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కో-ఆర్డినేటర్లు శ్రీనివాస్, సఫ్దర్ అలీఖాన్, కే చౌదరి, మండల విద్యాధికారి పోచయ్య, అధికారులు పాల్గొన్నారు.