మంచిర్యాల, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : భీమారం గ్రామ పంచాయతీ 1959లో ఏర్పడింది. చెన్నూరు- మంచిర్యాల రహదారిని ఆనుకొని ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదు. ఆహ్లాదం కరువై, బురదమయమైన రోడ్లతో దర్శనమిచ్చేది. ఎప్పుడు వస్తదో, ఎప్పుడు రాదో తెలియని కరంటుతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చేది. రాత్రయితే చిమ్మచీకటితో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఆఖరి మజిలీకి కూడా తిప్పలయ్యేది. కార్యక్రమాలకు, బట్టలు మార్చుకునేందుకు స్థలం లేక, ఎక్కడ దహనం చేయాలో తెలియక ప్రజలు నానాయాతన పడాల్సి వచ్చేది. సమీపంలోని అడవిలోనో, పొలాల్లోనో కార్యక్రమం కొనసాగించేవారు. స్వరాష్ట్రంలో భీమారం పంచాయయతీ అభివృద్ధికి నోచుకుంది. ‘పల్లె ప్రకృతి’ పుణ్యమాని గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, సర్పంచ్, అధికారులు, గ్రామస్తుల సమష్టి సహకారంతో మౌలిక వసతులన్నీ సమకూరాయి. గతంలో బురదమయమైన రోడ్లు సీసీ రహదారులుగా రూపాంతరం చెందాయి. వీధి దీపాలు జిగేల్మంటూ వెలుగుతున్నాయి. చెత్తాచెదారంతో రోగాలకు ఆలవాలమైన రోడ్లు.. పరిశుభ్రతతో అద్దంలా మెరుస్తున్నాయి. విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. భీమారం ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నది.
అడుగడుగునా అభివృద్ధి..
భీమారంలో మొత్తం జనాభా 6,476 కాగా, ఇందులో 3,252 మంది స్త్రీలు, 3,224 మంది పురుషులు ఉన్నారు. 2,388 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఎవరైనా చనిపోతే దహన సంస్కారానికి ఇబ్బంది లేకుండా వైకుంఠధామాన్ని రూ.9,86,000లతో నిర్మించారు. ఇందులో ప్రత్యేక దింపుడు గద్దెలు,రెండు బర్నింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. బట్టలు మార్చుకునేందుకు, మరుగుదొడ్ల కోసం, స్నానాల కోసం వేర్వేరుగా గదులను నిర్మించారు. వాడల్లోని చెత్తాచెదారాన్ని పారబోసేందుకు ఊరి పొలిమేరలో డంప్ యార్డును ఏర్పాటు చేశారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్ను నిర్మించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా దీనిలో మున్సిపల్ సిబ్బంది వేస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా 250 మీటర్ల మేర విద్యుత్ లేన్లను సరిచేశారు. నాలుగు కొత్త విద్యుత్ స్తంభాలను వేశారు. విరిగిపోయిన, వంగిపోయిన 20 విద్యుత్ స్తంభాలను తొలగించారు. 14 మీటర్ల థర్డ్లేన్ను బిగించారు. గ్రామంలో 686 వీధి దీపాలు ఉన్నాయి. కొత్తగా 400 ఎల్ఈడీ బల్బులను బిగించారు. వాడవాడలా సీసీ రోడ్లు ఉన్నాయి. వర్షాలకు బురదమయమైన చోట్ల కొత్తగా మట్టి రోడ్లను కూడా నిర్మించారు.
పరుచుకున్న పచ్చదనం..
భీమారంలో పచ్చదనం పరుచుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. ‘పల్లె ప్రకృతివనం’లో వివిధ రకాలైన పూలు, ఔషధ, నీడనిచ్చే మొక్కలను నాటారు. ఇందులో 6000 మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలో 7,800 మొక్కలు నాటారు. ఇందులో జామ, నిమ్మ, దానిమ్మ, వెలుగ, అల్లనేరెడు, మామిడి, చింత, కానుగ, అడవి తంగడి, నిద్ర గన్నేరు, చిన్న బాదం, గుల్మహర్, గోరింట, మొదలైన 100 శాతం మొక్కలు బతికే ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వీటి సంరక్షణ బాధ్యతలను చూస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి కోసం సర్పంచ్ రాంరెడ్డి, కార్యదర్శి సర్వశ్రేష్టతో పాటు ఎంపీవో బాపు, ఇతర అధికారులు, గ్రామస్తులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
భీమారంలో 13 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వారికి ఏడాదికి రూ.13,26,000 జీతాలు చెల్లిస్తున్నారు. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వీటితో ప్రతి రోజూ ఇంటి నుంచి తడిపొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది తరలిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామానికి ఏడాదికి రూ.80,97,528 నిధులు వస్తున్నాయి. ఇందులో పది శాతం గ్రీనరీ బడ్జెట్ కింద వినియోగిస్తున్నారు. గ్రామంలో చెత్త సేకరణకు ఆరు రిక్షా బండ్లు ఉన్నాయి. గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు చొప్పున 4,776 బుట్టలు పంపిణీచేశారు. పారిశుధ్యంలో భాగంగా సామూహిక మరుగుదొడ్లను కూడా వినియోగిస్తున్నారు. గ్రామంలో 2,480 మరుగుదొడ్లు ఉన్నాయి. 588 వ్యక్తిగత, 2 కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించారు. సామూహిక చేతిపంపుల వద్ద నీటి వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. బోరింగ్ వద్ద నుంచి నీరు ఇంకుడుగుంతలోకి వెళ్లేలా పైపులను అమర్చారు. పారిశుధ్యంతో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయి. సీజనల్ వ్యాధులు కూడా నమోదు కాలేదు.
గ్రామస్తుల సహకారం మరువలేనిది..
మా పంచాయతీ అభివృద్ధి చెందడంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఎంతగానో ఉంది. ప్రతి పల్లెకూ నిధులు ఇచ్చి, పారిశుధ్యం మెరుగు కోసం ట్రాక్టర్, ట్రాలీ సమకూర్చింది. ప్రజల సహకారం.. ప్రభుత్వ ప్రోత్సాహం తోనే గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దాం. దీనికి సర్పంచ్తో పాటు గ్రామస్తులు, అధికారులు ఎంతో శ్రమపడ్డారు. గ్రామస్తుల సహకారం మరువలేనిది.
కడుకుంట్ల సర్వశ్రేష్ట, పంచాయతీ కార్యదర్శి, భీమారం