Bengal teachers : పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 2016లో స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు చెల్లవంటూ సోమవారం కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC) స్పందించింది. కోల్కతా హైకోర్టు తీర్పును తాము పై కోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి మజుందార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
టీచర్ నియామకాలను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏం చేయబోతున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ప్రతినిధి మజుందార్ సమాధానం ఇచ్చారు. హైకోర్టు ఇచ్చిన 300 పేజీల తీర్పును సమగ్రంగా చదివి, అర్థం చేసుకుని న్యాయపరమైన అంశాలపై చర్చిస్తామని అన్నారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని తెలిపారు.
కాగా, 2016లో మమతాబెనర్జి ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించింది. స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఇవాళ కోల్కతా హైకోర్టు ఆ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. ఆ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు వారు అందుకున్న వేతనాలను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.