ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని పేదల పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మండలంలోని హర్కాపూర్తండా ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 34 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ రాజేశ్వర్, ఉపాధ్యాయిని రాథోడ్ సరస్వతి విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చిత్రాలు, పటాలు, ఇతర సామగ్రితో విద్యాబోధన చేస్తున్నారు. కాగా, ఈ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను ఎంపిక చేసింది.
రూ.21 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాలలో అభివృద్ధి పనులతోపాటు మరమ్మతులు, విద్యార్థులకు మౌళిక వసతులు కల్పిస్తున్నది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లతోపాటు పనులు ప్రారంభించింది. పాఠశాల భవనంతోపాటు ప్రహరీ, వంటగదికి వివిధ రంగులతో పెయింటింగ్ వేయిస్తున్నారు. పాఠశాల అవరణతోపాటు విద్యార్థుల తరగతి గదుల్లో ప్రత్యేకమైన కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.13 లక్షలతో పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణంతోపాటు మూడు చోట్ల ప్రత్యేకమైన గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.4 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మరో రూ.4 లక్షలతో వంటగది నిర్మించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4 లక్షలతో పాఠశాల భవనానికి మరమ్మతులు చేపడుతున్నారు. అన్ని రకాల పనులు పూర్తి కాగానే పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ నిర్మాణాలతో గ్రామస్తులతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లిష్లో బోధిస్తున్నాం
పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు ఇంగ్లిష్లోనే బోధిస్తున్నాం. విద్యార్థులు మాతృ భాషలో ఇక్కడ మాట్లాడకుండా పూర్తిగా ఇంగ్లిష్లోనే చెబుతున్నాం. దీంతో వారికి ఇంగ్లిష్ రాయడం, చదవడం, మాట్లాడడం సులువవుతుంది. పాఠశాలలో ప్రత్యేకంగా తయారు చేసిన పట్టిక ప్రకారం అక్షరాలు చెప్పడంతో విద్యార్థులు వాటిని తొందరగానే గుర్తుపట్టి పలుకుతున్నారు. ఇంగ్లిష్ పదాలు నేర్చుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – రాథోడ్ సరస్వతి, ఉపాధ్యాయురాలు
పాఠశాలతోనే గ్రామానికి గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో మా గ్రామ పాఠశాలను ఎంపిక చేసింది. దీంతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తున్నది. రూ.21లక్షలను ప్రభుత్వం మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నది. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ పనులను ప్రతిరోజూ పరిశీలిస్తున్నాం. గ్రామంలోనే ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో విద్యార్థులు మండలకేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. గ్రామంలోనే ఉన్నతమైన ఇంగ్లిష్ చదువులు బోధిస్తున్నారు. పిల్లలు కూడా శ్రద్ధగా చదువుకుంటున్నారు.
– రాథోడ్ సేవంతరోహిదాస్, సర్పంచ్