లక్షెట్టిపేట, మార్చి 8 : ఆస్తి వివాదంలో ఓ యువకుడు తన తమ్ముడి ఇంటి ఎదుట బైక్ తగులబెట్టుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్రాబోర్ సమీపంలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. దండేపల్లి మండలం మ్యాదరిపేటకు చెందిన జునైత్కు.. తన తమ్మునికి కొద్ది రోజులుగా ఆస్తి పంపకాల విషయమై వివాదం జరుగుతుంది.
సొంత తమ్ముడే తనను మోసం చేస్తున్నాడని, తనపై చేతబడి చేపించడం వల్ల ఇటీవల బైక్ ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడని కంటతడి పెట్టుకున్నాడు. ఆ కోపంలోనే తన తమ్ముడి ఇంటిముందు బైక్పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లు తెలిపాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పి బాధితుని నుంచి వివరాలు సేకరించారు.