నిర్మల్ అర్బన్, జనవరి 3 : ప్రజల భద్రత, రక్షణ కోసమే జిల్లా పోలీస్ యాంత్రాంగం 24 గంటల పాటు కృషి చేస్తున్నదని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. పోలీస్ అసోసియేషన్ సభ్యులు రూపొందించిన 2023 క్యాలెండర్ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకొని శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పదునుపెట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలువాలన్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటైన షీ టీం బృందాలు మరింత పకడ్బందీగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై నిఘా పెంచాలని, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచేలా కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు రమేశ్, పట్టణ సీఐ శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఐలు హతిరాం, రామకృష్ణ, అసోసియేషన్ అధ్యక్షుడు విరాసత్ అలీ తదితరులున్నారు.
ఐదుగురి హత్య కేసులో నిందితుడికి జైలు.. వివరాల వెల్లడి..
బైంసా పట్టణంలో ఐదుగురిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భైంసా పట్టణంలో 2013లో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగిన కేసులో ఓ కుటుంబం ఫిర్యాదు మేరకు ప్రత్యర్థి కుటుంబం వారికి కోర్టు శిక్షను విధించింది. దీంతో కక్షకట్టిన ప్రత్యర్థి కుటుంబం వారు 2016, మే 5న నిర్మల్ భైంసా చౌరస్తాలో ఈ కుటుంబానికి చెందిన ఇద్దరిని కత్తులతో కిరాతంగా నరికి చంపారు. అనంతరం వారి ఇంటికి వెళ్లి మరో ముగ్గురి కత్తులతో నరికి చంపారు. ఈ కేసులో నిందితుడైన మాజీ ఖాన్కు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదుతోపాటు రూ.25వేల జరిమానా విధించారు.
ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేయాలని ఎస్పీ కోరారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందితో పాటు, పీపీ రమణా రెడ్డిని సన్మానించారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, పీపీ రమణా రెడ్డి, భైంసా సీఐ ప్రవీణ్ కుమార్, లైజన్ అధికారి సక్రియా నాయక్, అసిస్టెంట్ లైజన్ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.