మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ‘ఓం నమ:శివాయ.. హర హర మహాదేవ.. శంభోశంకర..’ అంటూ సాగిన శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మారుమోగాయి. ప్రసిద్ధిగాంచిన వేలాల మల్లన్న, కత్తెరశాల మల్లికార్జున స్వామి, బుగ్గ రాజరాజేశ్వర స్వామి, ఆసిఫాబాద్ జిల్లాలోని ఈస్గాం శివమల్లన్న.. తదితర ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. వేకువ జామునుంచే వాగులు, నదుల్లో పుణ్యస్నానాలు చేసి త్రినేత్రుడిని దర్శించుకున్నారు.
పట్నాలు వేసి.. బోనాలు సమర్పించారు. రుద్రాభిషేకాలు, శివ పార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజలు కనులపండువగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టి, రాత్రంతా జాగరణ చేశారు. పలు దేవస్థానాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయాచోట్ల ఆలయ కమిటీలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.