భైంసా, సెప్టెంబర్ 20 : భైంసా మండలంలో సుమారు ఐదుకు పైగా పశువులకు లంపీస్కిన్ లక్షణాలు కనిపించినట్లు పశువైద్యాధికారులు గుర్తించారు. వారం రోజులుగా పశువుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా నిర్ధారించారు. కరోనా వ్యాప్తి మాదిరిగా ఒక పశువు నుంచి మరో పశువుకు ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు పశువైద్యాధికారులు చెబుతున్నారు. కాగా, పశువులకు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యశాలకు తీసుకురావాలని, అప్రమత్తంగా ఉండాలని రైతులు, యజమానులకు సూచించారు.
ఈ వ్యాధి సోకిన 48 గంటల్లో తల, మెడ, పొదుగు, జననేంద్రియాలపై దద్దుర్లు ఏర్పడుతాయని పేర్కొంటున్నారు. అవి పగిలిపోయి, చర్మం ఊడిపోతుందని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి మరింత తీవ్రమవుతుందని సూచిస్తున్నారు. ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాపిస్తుండడంతో వ్యాధి సోకిన వాటిని వేరుచేసి ఉంచాలని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..
తానూర్, సెప్టెంబర్ 20 : మండలంలోని పశువుల యజమానులు లంపీ స్కిన్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా పశువైద్యాధికారి శంకర్ సూచించారు. మండలంలోని వడ్గావ్లో పశువులకు లంపీ స్కిన్ టీకా వేశారు. తమ పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలని యజమానుకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలో పశువైద్యశాలను సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. వీరి వెంట పశువైద్యాధికారి గోపాల్మహాజన్ సిబ్బంది ఉన్నారు.