కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని డోడర్న తండా పరిసర అటవీ ప్రాంతంలో చిరుత ( Leopard ) సంచరిస్తుండడం తో పరిసర గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతుల కు గురవుతున్నారు. కాగా శనివారం గ్రామానికి చెందిన పశువుల మంద ( Cattle Herd ) అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లగా చిరుత దాడి చేసి అదే గ్రామం జాదవ్ ఉత్తమ్కు చెందిన ఆవును చంపేసింది.
పశువుల కాపరి యజమానికి సమాచారం అందించడంతో ఆయన అటవీ, పశువైద్య అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు ఆ ప్రాంతంలో చిరుత అడుగులను గుర్తించారు. పశువైద్యాధికారి పంచనామా నిర్వహించారు. సుమారు 50 వేల రూపాయల విలువైన ఆవును చిరుత పొట్టన పెట్టుకుందని, ప్రభుత్వం తనకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతు ఉత్తం విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఒంటరిగా చేలకు వెళ్లరాదని, చేతిలో కర్రలతో గుంపులు, గుంపులుగా కలిసి వెళ్లాలని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లరాదని,ఈ సమాచారాన్ని ప్రతి గ్రామంలో దండోరా వేయించి తెలియపరచాలని నాయకులకు, ప్రజాప్రతినిధులను కోరారు.