మంచిర్యాల, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీలో టికెట్ల పంచాయతీ ముదిరిపాకాన పడింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. మరోవైపు కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ప్రకటించినా.. బీజేపీ మాత్రం ప్రకటించకపోవడం ఆ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదనే ప్ర చారం ఊపందుకోంది. ఈ నేపథ్యంలో మొన్నీ మ ధ్యే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కమలం పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ.. ఇందులో రెం డు నియోజకవర్గాల్లో ముందు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని, ఉన్న ఫలంగా ఈ మధ్యే ఊడిపడిన పారాచూట్ నాయకులకు టికెట్లు ఇవ్వడం ఉమ్మడి జిల్లా కమలంలో అగ్గి రాజేసింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టికెట్ ప్రకటించిన రోజే నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనా మా చేశారు. ముథోల్ టికెట్ తనకు ఇవ్వకుండా బీజేపీ అధిష్టానం అన్యాయం చేసిందని ప్రెస్మీట్ పెట్టి మరీ ఆమె కంటతడి పెట్టుకున్నారు. పదేండ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంటే గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. తనను కాదని ఏడాది క్రితం పార్టీ లో చేరిన మాజీ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్కు టికెట్ ఇవ్వడంపై ఆమె బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఏదేమైనా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ నాయకులు అందరి కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని, అలాంటి తనను పక్కన పెట్టడం సరికాదని వాపోయారు.
బెల్లంపల్లిలో వివేక్ చిచ్చు
బెల్లంపల్లి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కావాలనే ఓడిపోయే డమ్మీ అభ్యర్థికి ఇచ్చినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గడ్డం వినోద్కు టికెట్ వచ్చింది. దీంతో బీజేపీ పార్టీలో ఉన్న వినోద్ తమ్ముడు మాజీ ఎంపీ గడ్డం వివేక్ తన అన్న కోసం లోపాయికారిగా పని చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్నకు పోటీ తగ్గించేందుకు బీజేపీ ఓటు బ్యాంక్తోపాటు, గతంలో తాను కాంగ్రెస్లో పనిచేసినప్పుడు తన వెంట ఉన్న కేడర్ను అన్న వైపు తిప్పేందుకు చక్రం తిప్పుతున్నారనే చర్చ నడుస్తోంది. అందుకోసమే బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కొయ్యల ఏమాజీని తప్పించి, కావాలనే అమురాజుల శ్రీదేవీకి టికెట్ ఇప్పించారని చెప్తున్నారు. ఏమాజీ సైతం ప్రెస్మీట్ పెట్టి ఇదే విషయాన్ని చెప్పారు. అన్న వినోద్ కోసం వివేక్ బీజేపీ పార్టీని బలిస్తున్నారంటూ మండిపడ్డారు. శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని మార్చాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఈ నియోజకవర్గంలో కమలం పార్టీకి పెద్దపట్టు లేదు. పోటీ చేసినా గెలవదు. ఈ విషయం అర్థం చేసుకునే వివేక్ తన అన్న కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారని, అందుకే సాదాసీదా పారాచూట్ అభ్యర్థిని పెట్టారని అనుకుంటున్నారు. కాస్తోకూస్తో పట్టున్న ముథోల్ నియోజకవర్గంలో టికెట్ను కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీకి ఇచ్చి అభాసుపాలైన కమలం పార్టీ, బెల్లంపల్లిలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి రెండు నియోజకవర్గాల్లో చేతులు ఎత్తేసింది. ఇక అభ్యర్థులను ప్రకటించినా.. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఆ పార్టీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. డిపాజిట్ దక్కుతుందని కూడా చెప్పలేని దుస్థితి ఉంది.
వినోద్ కోసమే వివేక్ కుట్ర
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్ విజయానికి ఆయన సోదరుడు మాజీ ఎంపీ వివేక్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా జీవితంలో లేని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని బెల్లంపల్లి బీజెపీ అభ్యర్థిగా ప్రకటించడం అన్యాయమన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ గెలుపు కోసం వివేక్ అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని క్షేత్రస్థాయి నుంచి ఐదేళ్ల కాలంలో బలోపేతం చేశానని చెప్పారు. శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బొల్లెడ కేశవరెడ్డి, గోవర్ధన్, శ్రావణ్, శ్రీనివాస్, నర్సింగ్, వాసు పాల్గొన్నారు.