‘మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో సంస్కరణలు అవసరం. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా మన విద్యార్థులు కూడా మారాల్సిన అవసరమున్నది. అది ఆంగ్ల విద్యతోనే సాధ్యమమవుతుంది. కానీ, పేద, మధ్యతరగతి వర్గాలకు ఇంగ్లిష్ ఒక కలగానే ఉన్నది. ఆర్థికభారంతో ప్రైవేటు బడుల్లో పిల్లల్ని చదవించలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది కలలను నెరవేరుస్తున్నది. ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల బోధన విద్యారంగంలో గొప్ప సంస్కరణలకు నాంది పలుకుతుంది. పేద పిల్లల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తుంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.’ అని ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ‘మన ఊరు-మన బడి’ పథకంతో సర్కారు బడిలో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని, ప్రవేశాలు పెరిగి జవసత్వాలు సంతరించుకుంటాయని చెబుతున్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్కే సాధ్యమవుతుందని, ఏదేమైనా తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామంటున్నారు. – కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్, జవనరి 27
కరీంనగర్ (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్, జవనరి 27 : వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కింద ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడం సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నది. పేద, మధ్య తరగతి పిల్లల భవిష్యత్కు భరోసానివ్వడమే కాదు.. సర్కారు స్కూళ్లకు పునర్జీవం వస్తుంది. అటు తల్లిదండ్రులు.. ఇటు ఉపాధ్యాయులు ఇంగ్లిష్ బోధనకు జై కొడుతున్నారు. బడులు మూతపడకుండా ఉండాలన్నా.. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలన్నా.. పేద, మధ్య తరగతి వర్గాలపై ఫీజుల భారం తగ్గాలన్నా.. ప్రైవేట్ విద్యాసంస్థలకు కల్లెం వేయాలన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం తప్పని సరి అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. అంతేకాదు, ప్రైవేట్ టీచర్ల కన్నా.. ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రతిభావంతులని చెబుతున్నారు. సర్కారుకు అండగా నిలిచి ఈ నూతన విద్యావిధానాన్ని విజయవంతం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ‘మన ఊరు-మన బడి’పై పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయం ఇది. వారి మాటల్లోనే..
మౌలిక సదుపాయాలు సమకూరుతాయి..
రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం చదువులతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకే మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించనున్నది. ముఖ్యంగా పిల్లలకు పూర్తిస్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం, కొత్త భవనాలు, డిజిటల్ తరగతులు, ఇలా అన్ని అంశాల్లో మార్పులు రానున్నాయి. ఇంగ్లిష్ మీడియం ద్వారా విద్యార్థులు భవిష్యత్లో ఇతర ప్రాంతాల్లో ఇబ్బందుల్లేకుండా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.
-లక్ష్మీ ప్రసాద్ రెడ్డి టీఎస్ యూటీఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం విఫలం
ఉమ్మడి ఏపీలో సక్సెస్ స్కూల్ పేరిట 6500 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించినా, సక్సెస్ కాలేదు. ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుత ప్రభుత్వం ఒక మంచి కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం.
-జుట్టు గజేందర్, ఎస్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు
ఇంగ్లిష్ మీడియంతో మరింత బలోపేతం
ప్రభుత్వ బళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే పాఠశాలలు మరింత బలోపేతమవుతాయి. ప్రస్తుతం పోటీ పరీక్షలన్నీ ఇంగ్లిష్ మీడియంలో ఉండడం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతగా రాణించడం లేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అమల్లోకి వస్తే, పేద విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్తా చాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్థిలో ఇంగ్లిష్పై పట్టు సాధించేలా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది.
-శశిరాజ్, తపస్ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళ..
ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెడితే ప్రభు త్వ పాఠశాలలకు కొత్త కళ వస్తుంది. భారీగా అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంటుంది. మన ఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం చెబు తున్నది. ఇది హర్షణీయం. ముఖ్యంగా విద్యార్థులకు మౌలిక వసతులు సమకూరితే చదువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
యూనియన్ తరఫున స్వాగతిస్తున్నాం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టాలని గతంలోనే మా సంఘం తరపున కోరాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే నిర్ణయం బాగుంది. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వ బళ్లన్నింటిలో నో అడ్మిషన్స్ అని బోర్డులు పెట్టాల్సి వస్తుందనే విషయంలో అతిశయోక్తి లేదు. పేద పిల్లలకు ఈ నిర్ణయం అతి పెద్ద వరం.
ఆంగ్ల మాధ్యమంతోనే బలోపేతం..
ప్రస్తుతం తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోనే చదివించడానికి ఇష్టపడుతున్నారు. అవకాశం ఉన్నవారు మైనార్టీ, బీసీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో వేస్తున్నారు. డబ్బులున్నవారు ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తున్నారు. కానీ పేద కుటుంబాల్లోని చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలను ఆంగ్లమాధ్యమంలో చదివించాలని ఉన్నా ఆర్థిక స్థితి బాగా లేక వేయలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం అభినందనీయం. దీని వల్ల ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ స్థితి వస్తుంది. ఇక అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుంది.
చరిత్రలో నిలువడం ఖాయం..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయుల మంతా స్వాగతిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన పాఠశాలలు స్వరాష్ట్రంలో కొత్త శోభ సంతరించుకున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చాలా మంది పేద విద్యార్థులకు మంచి జరుగుతున్నది. ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తే, పేద విద్యార్థికి న్యాయం చేసినట్లవుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది చదువులు మానేస్తున్నారు. ఇలాంటి వారందరూ ఉచితంగా చదివేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.