మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 25 : రోజు రోజుకూ పెరుగుతున్న నకిలీ కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ మరో అడుగు ముందుకేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విత్తనాలు, ఎరువుల లైసెన్స్లు ఆన్లైన్ చేయగా ప్రస్తుతం పురుగు మందుల లైసెన్స్లు కూడా ఆన్లైన్ చేసే పనిలో పడింది. నకిలీ కంపెనీల నుంచి రైతులు బయటపడే అవకాశం ఉంది. ఆన్లైన్లో లేని కంపెనీల పురుగు మందులను విక్రయించకుండా కట్టుదిట్టం చేస్తే నకిలీ పురుగు మందులను రైతులను కాపాడినట్లవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సరఫరా అయ్యే విత్తనాలు, ఎరువులు నాణ్యమైనవే ఉండాలనే ఉద్దేశంతో గతేడాది సీడ్స్, ఫర్టిలైజర్ల లైసెన్స్లు ఆన్లైన్ చేయించింది. దీనితో నకిలీ సీడ్ కంపెనీలు విత్తనాలకు అడ్డుకట్ట పడినట్లయింది. ఎరువుల దుకాణానికి సదరు ఫర్టిలైజర్ కంపెనీ ‘ఓ’ ఫాం ఉంటేనే విక్రయించడం ప్రారంభమైంది. ఫెస్టిసైడ్స్ లైసెన్స్లను సైతం ఆన్లైన్ చేసే క్రమంలోనే ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ప్రస్తుతం ఆ చర్యను సంబంధిత శాఖ అధికారులు చేపట్టారు. గతంలో పీసీ, ఓ ఫారంలు అమాండ్మెంట్ చేయాలంటే దుకాణా యజమాని మండల వ్యవసాయాధికారి(ఏవో) దగ్గరకు వచ్చే వారు, ఈ విధానంతో ఏవోనే దుకాణం వద్దకు వెళ్లి అన్ని పరిశీలించాక అమాండ్మెంట్ చేసే అవకాశం కల్పించారు.
ఆన్లైన్ ఫెస్టిసైడ్ లైసెన్స్ మేనేజ్మెంట్ సిస్టంతో నకిలీ పీసీ(ప్రిన్సిపల్ సర్టిఫికెట్)లకు చెక్ పడనుంది. మ్యానువల్గా ఉన్నప్పుడు పురుగు మందులకు సంబంధించిన పీసీలు కేవలం ఏవో పరిశీలించి అమాండ్మెంట్ చేసేవారు. అందులో కొన్ని కంపెనీలు అర్హత లేకున్నా ప్రొడక్టులతోపాటు పీసీలు ఫెస్టిసైడ్ దుకాణాలకు అందించే వారు. దాని అనామత్తో స్థానికంగా దుకాణా యజమానులు రైతులకు ఆ కంపెనీ పురుగు మందులను విక్రయించేవారు. ఆన్లైన్ కావడంతో అర్హత గల కంపెనీల పీసీలు మాత్రమే తీసుకోనుంది. దీంతో నకిలీ కంపెనీల బండారం బయటపడనుంది.
జిల్లాలోని 18 మండలాల్లో 389 పురుగు మందులు విక్రయించే దుకాణాలున్నాయి. బెల్లంపల్లి మండలంలో 17 దుకాణాలు, భీమారంలో 8, భీమినిలో 15, చెన్నూర్లో 57, దండేపల్లిలో 42, హాజీపూర్లో 17, జైపూర్లో 16, జన్నారంలో 26, కన్నెపల్లిలో 24, కాసిపేటలో 11, కోటపల్లిలో 32, లక్షెట్టిపేటలో 35, మంచిర్యాలలో 18, మందమర్రిలో 14, నస్పూర్లో 3, నెన్నెలలో 13, తాండూరులో 18, వేమనపల్లి మండలంలో 23 పురుగు మందుల దుకాణాలున్నాయి.
కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా అన్ని పురుగుల మందులు విక్రయించే దుకాణాల లైసెన్స్ల వివరాల ఆన్లైన్ చేయాల్సి ఉంది. దుకాణానికి పురుగుల మందులు విక్రయించేందుకు లైసెన్సు ఉందా! లేదా!, దుకాణ యజమాని వివరాలు, దుకాణం ఎక్కడ ఉంది, గోదాం ఉంటే దాని వివరాలు, దుకాణం నడిపే వారి వివరాలు, దుకాణంలో విక్రయిస్తున్న పురుగు మందుల కంపెనీల నుంచి ఇచ్చిన పీసీల వివరాలు, లైసెన్స్ వివరాలను మండల వ్యవసాయాధికారులు ఆన్లైన్ చేస్తున్నారు.