ధరణి.. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నది. గతంలో ఎలాంటి లావాదేవీలైనా రెవెన్యూ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది చేతుల్లో ఉండగా, ఇప్పుడు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అప్డేషన్.. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పని లేకుండా పోయింది. ఇక ఈ పోర్టల్లో రైతులందరి డేటా పక్కాగా నమోదు చేయగా, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లు.. ఇలా ప్రతి పనికీ ఆధారంగా మారుతున్నది. పైసా ఖర్చులేకుండా సులభంగా.. వేగంగా.. పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు సాగుతుండగా, ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలు ధరణిని తీసేయాలని వ్యాఖ్యానించడంపై రైతాంగం మండిపడుతున్నది.
మంచిర్యాల, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతి నిధి) : ధరణి పోర్టల్ వచ్చాక వ్యవసాయ భూము ల లెక్కలు పక్కాగా రికార్డుల్లోకి ఎక్కాయి. ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపించింది. రైతు కు ఉన్న మొత్తం భూమికి రైతుబంధు వచ్చిందం టే.. పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొను గోలు చేస్తుందంటే.. రైతు బీమా డబ్బులు వెంటనే ఖాతాల్లో పడుతున్నాయంటే అది ధరణి పుణ్యమే. పౌరసరఫరాల శాఖతో ధరణి ఖాతాలను, వ్యవసా య శాఖ రికార్డులను అనుసంధానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోళ్లకు ధరణినే ప్రామాణికంగా తీసుకుంటున్న ది. ఇలా అనేక ప్రయో జనాలున్న ధరణి పోర్టల్ను తాము అధికారంలోకి రాగానే తీసేస్తామని కాంగ్రె సోళ్లు, అసలు ధరణియే అవసరం లేదని బీజేపోళ్లు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
దోపిడీ రాజ్యం పోయి మంచి రోజులు వస్తే చూసి ఓర్వలేక రాజకీయాలు చేస్తు న్నారంటూ మండిపడుతున్నది. ధరణి వచ్చాకే భూ సమస్యలు పరిష్కారమయ్యాయని.. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ల కోసమని కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పిందని వారంతా చెబుతు న్నారు. కాంగ్రెస్ పాలనలో లంచం ఇవ్వనిదే ఫైలు కదిలేది కాదని.. ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా నిమిషంలోనే పని అయిపోతుందని చెబుతు న్నారు. గతంలో రైతు మరణిస్తే ఆపద్బంధు కింద రూ.50 వేలు ఇచ్చేవారని, ఆ డబ్బులు కూడా ఎప్పుడు వచ్చేవో తెలిసేది కాదని, ఒకవేళ వచ్చినా అందులో నుంచి రూ.30 వేల దాకా లంచాలకే పోయేవని, అదే ఇప్పుడు రైతు మరణించిన నెల రోజుల్లోపే రూ.5 లక్షలు ఖాతాల్లో జమ అవుతున్నాయని, ధరణిని తీసేస్తే దౌర్భాగ్యమేనని అంటున్నారు.
ధరణి రాకముందు లంచమడిగిన్రు
మాకు మంచిర్యాల శివారులో రెండెకరాల 14 గుంటల భూమి ఉంది. కానీ మా సర్వే నంబర్లో నా భర్త తిరుపతి, నా పేరు మీద ఐదెకరాలు ఉన్నట్లు చూపిస్తున్నది. మా పేరు మీద ఎక్కువ భూమి ఉంది తీసేయాలని 2019లో ధరణి రాకముందే ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నం. అందులో పనిచేసే సిబ్బంది ఎకరాకు రూ.30 వేల లంచం ఇస్తే తీసేస్తమని చెప్పిన్రు. అప్పటి సంది కొట్లాడుకుంట వచ్చినం. ధరణి వచ్చినంక కలెక్టర్ను కలిసి మాట్లాడినం. మూడు రోజుల్లో ఎవరి భూమిని వారి పేరుమీదికి మార్పిచ్చిన్రు. మా పేరు మీద మిగిలిన రెండెకరాల 14 గుంటలకు ఈ రోజే నాలా కన్వర్షన్ చేసుకున్నం. 10 నిమిషాల్లోనే పనైపోయింది. ధరణిలో పైసా ఖర్చుకాలే. గింత మంచి వెబ్సైట్ను తీసేసి పాత పద్ధతిలో రికార్డులు పెడ్తమని కాంగ్రెసోళ్లు చెబుతున్నరు. దోపిడీకి అలవాటు పడినోళ్లు గట్లనే మాట్లాడుతరు. ధరణిని తీసేస్తే దౌర్భాగ్యమే. – జునుబాల రాజకుమారి, మంచిర్యాల
గతంలో నెలల కొద్దీ తిరిగేటోళ్లం
మాది కోటపల్లి మండలం ఆలుగామ గ్రామం. నేను మా ఊరికి చెందిన మారిశెట్టి బానయ్య దగ్గర ఎకరం భూమి కొన్న. పట్టా కోసం మీసేవకు వెళ్లి ఇయ్యాలా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న. ఆఫీస్కు వచ్చి రాగానే నా వేలి ముద్రలు, భూమి అమ్మిన వ్యక్తి, సాక్షుల వేలి ముద్రలను తీసుకున్నారు. పది నిమిషాల్లో నా పేరిట పట్టా చేసిన్రు. గతంలో భూమి కొన్నప్పటి నుంచి ఏడాది వరకు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా పనికాకపోయేది. దానికి తోడు పైసలు కూడా ఖర్చయ్యేటివి. ఇప్పుడు గా తిప్పలు లేవు. గింత మంచి ధరణిని కాంగ్రెస్ వాళ్లు తీసేస్తామనడం సరికాదు. ఏ రాజకీయమైన చేసుకోండి.. కానీ రైతుల జోలికి మాత్రం రావొద్దు.
– రామటెంకి సులోచన, ఆలుగామ (కోటపల్లి)
పది.. పదిహేను నిమిషాల్లోనే&
భూ వివరాలన్నీ ఆన్లైన్లో నిక్షిప్తం అయి ఉన్నాయి. ధరణి ద్వారా స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టా పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ చకచకా జరిగిపోతుంది. గతంలో ఒకరికి పట్టా చేయాలంటే సమయం పట్టేది. ధరణి ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని మా ఆఫీస్కు వస్తే అన్ని వివరాలను సరి చూసుకొని పది.. పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఆ వెంటనే ఆన్లైన్ పాస్బుక్ కాఫీని అందజేస్తున్నాం. ఈ కొత్త విధానం ద్వారా భూములకు సంబంధించి క్రయవిక్రయాలు ఎలాంటి అక్రమాలు లేకుండా జరుగుతున్నాయి.
– సునీల్ కుమార్ దేశ్పాండే, తహసీల్దార్, కోటపల్లి