చెన్నూర్ టౌన్, నవంబర్ 6 : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం లక్ష దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లోక కల్యాణార్థం శివాలయం అర్చక బృందం, స్థానిక వేద పండితుల పర్యవేక్షణలో దీపారాధన చేశారు. మొదట సమన్వయకర్త, కోటపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ గొడిసెల దేవకి బాపురెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కో గడిలో రెండు వేల దీపాల చొప్పున, మొత్తం 50 బాక్సులు ఏర్పాటు చేసి మొత్తం లక్ష దీపాలు వెలిగించారు.
హైదరాబాద్కు చెందిన ప్రవచన రత్న, ప్రవచన సుధ సుధాకర మల్లాది వెంకట రామనాథ శర్మ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శివాలయ అర్చకులు జక్కెపల్లి హిమాకర్ శర్మ, ముక్తేశ్వర్ శర్మ, నాగేశ్వర్ శర్మ, అర్చకులు వేమారపు మహేశ్వర్ శర్మ, సత్యమూర్తి శర్మ, శ్రీరాంభట్ల సత్యనారాయణ, రేగళ్ల భూషణ్ శర్మ, అకినెపెద్ది సృజన్, మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు గర్రెపల్లి వెంకట నర్సయ్య, మల్లిక్, జాడి తిరుపతి, మేడ సురేశ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక శివాలయంలో ఎక్కాహం (24 గంటల నిరంతర భజన) నిర్వహించారు. రాత్రి 12 గంటలకు శివుని విగ్రహంపై ఉమ్మెత్త పువ్వును ఉంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జక్కెపల్లి నాగేశ్వర్ రావు బృందం ఆలపించిన భజన పాటలు అలరించాయి.